ఈనెల 9న ఢిల్లీకి కిసాన్‌ రైలు: కలెక్టర్‌

4 Sep, 2020 14:59 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌కు కిసాన్ రైలు మంజూరైందని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు ఉద్దేశించిన ఈ రైలు అనంతపురం - ఢిల్లీ మధ్య రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు. రైతులకు లబ్ధి చేకూర్చే కిసాన్‌ రైలును ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.(చదవండి: 9న ఢిల్లీకి కిసాన్‌ రైలు )

కాగా అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల నుంచి అక్టోబర్‌ నుంచి ప్రతిరోజూ కిసాన్‌రైలు నడపడానికి రైల్వే అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మె ల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. అనంత నుంచి హస్తినకు వెళుతున్న తొలి కిసాన్‌రైలులో 500 టన్నుల వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులతో పాటు రైతులు, అధికారులు, కొందరు వ్యాపారులు వెళ్లడానికి ప్రత్యేకంగా స్లీపర్‌కోచ్‌ బోగీ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: కిసాన్‌ రైలు)

ఇక రైల్వే శాఖ ప్రవేశపెట్టిన కిసాన్‌ రైలు సేవల ద్వారా రైతులు పండించే పళ్ళు, కూరగాయల రవాణాలో రోడ్డుమార్గంతో పోల్చుకుంటే ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రకు చెందిన నాసిక్‌ జిల్లా దియోలలి నుంచి బిహార్‌లోని దనాపూర్‌కు దేశంలోనే తొలి కిసాన్‌ రైలును కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఆగష్టులో ప్రారంభించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు