‘జీతం మాత్రం చక్కగా తీసుకుంటారు.. చేతకాకపోతే వెళ్లిపోండి’ జేసీ ఫైర్‌

23 Dec, 2021 15:00 IST|Sakshi
వెంకటాంపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న జేసీ అట్టాడ సిరి

సాక్షి, అనంతపురం: ‘జీతం మాత్రం చక్కగా తీసుకుంటున్నారు...బాధ్యత మాత్రం విస్మరిస్తున్నా రు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన అదేశాలు అమలు చేయాల్సిన బాధ్యత లేదా..? పనిచేయడం చేతకాకపోతే ఇళ్లకు వెళ్లిపోండి.’ అని జాయింట్‌ కలెక్టర్‌ అట్టాడ సిరి చెన్నేకొత్తపల్లి, వెంకటాంపల్లి పంచాయతీ కార్యదర్శులు అరుణ్‌ పాండే, యల్లప్పలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మండలంలోని వెంకటాంపల్లి, చెన్నేకొత్తపల్లి, ఓబుళంపల్లి గ్రామాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంకటాంపల్లి, చెన్నేకొత్తపల్లి గ్రామాల్లోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సందర్శించారు.

అవి మరీ అధ్వానంగా ఉండటంతో సంబంధిత పంచాయతీ కార్యదర్శుల కు మెమోలు జారీ చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం వెంకటాంపల్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. భోజనం సరిగా లేకపోవడంతో వెంటనే ఏజెన్సీ మార్చాలని ఎంఈఓ మల్లికార్జునకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచులు జయరామిరెడ్డి, చెన్నారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జేసీ సిరి కనగానపల్లి మండలంలోని మామిళ్లపల్లిలో పర్యటించి జలకళ పథకం ద్వారా రైతుల పొలాల్లో వేసిన బోరుబావులను పరిశీలించారు.
చదవండి: అందరికీ సంక్షేమ ఫలాలు.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో సీఎం జగన్‌

అధికారులు అందజేసిన నివేదికలోని కొలతల ప్రకారం బోరుబావి ఉందా? లేదా ? తెలుసుకునేందుకు పరమేశ్వరరెడ్డి పొలంలోని బోరుబావి లోతును కొలిపించారు. అనంతరం అధికారులు, రైతులతో జేసీ మాట్లాడుతూ ‘వైఎస్సార్‌ జలకళ’ పథకం మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బోర్లు తవ్వడం, విద్యుత్‌ సరఫరా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జేసీ వెంట ఏపీడీ పుల్లారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది, రైతులు ఉన్నారు.  
చదవండి: ఎమ్మెల్యే మద్దాల గిరి కుమారుని వివాహానికి హాజరైన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు