Jahnavi Dangeti: వ్యోమగామి కలకు సీఎం జగన్‌ చేయూత

15 Sep, 2022 13:19 IST|Sakshi

జాహ్నవికి రూ.50 లక్షల చెక్కు అందజేత 

సాక్షి, అమరావతి/పాలకొల్లు అర్బన్‌: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామి అవ్వాలనే కలను సాకారం చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ రూ.50 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసినట్టు పౌరసంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. సచివాలయంలో బుధవారం జాహ్నవికి చెక్కును అందజేశారు. 


చదవాలనే తపన ఉండి నిరుపేద విద్యార్థులకు సీఎం జగన్‌ ఎప్పుడూ అండగా నిలుస్తారని చెప్పారు. జాహ్నవి పంజాబ్‌లో ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. వ్యోమగామి అవ్వాలనే లక్ష్యంతో నాసాతో పాటు పోలాండ్‌లో అనలాగ్‌ ఆస్ట్రోనాట్‌ శిక్షణ పొందింది. అయితే వ్యోమగామికి అంతర్జాతీయ సంస్థలో పైలెట్‌ శిక్షణ పొందాల్సి ఉండగా ఆర్థిక సాయం నిమిత్తం సీఎంని కలిసి కోరగా సానుకూలంగా స్పందించారు. నెలలోపే ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. 


జాహ్నవి మాట్లాడుతూ సీఎం దీవెనలతో త్వరలోనే శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తానని చెప్పారు. వ్యోమగామిగా దేశ కీర్తిని పెంచేందుకు కష్టపడతానని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కవురు శ్రీనివాసరావు ఉన్నారు. విజయవాడలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను జాహ్నవి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా జాహ్నవిని పద్మ సత్కరించారు. (క్లిక్ చేయండి: చరిత్ర సృష్టించిన జాహ్నవి.. స్పేస్‌ కావాలి!)

మరిన్ని వార్తలు