ఉపాధి బకాయిలు చెల్లించాం

8 Oct, 2021 04:59 IST|Sakshi

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి:  ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు చెల్లించాల్సిన రూ.1,500 కోట్ల బకాయిలన్నింటినీ చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ఇప్పటికే రూ.1,121 కోట్లు చెల్లించామని, మిగిలిన రూ.372 కోట్లను ఈ నెల 4న విడుదల చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ తెలిపారు. ఈ మొత్తాలను ఆయా గ్రామ పంచాయతీలకు జమ చేశామన్నారు. గతంలో చెల్లించిన రూ.1,121 కోట్లలో రూ.1,061 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారని, పలు కారణాలతో రూ.60 కోట్లు పంచాయతీల ఖాతాల్లో ఉన్నాయని తెలిపారు.

ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు  సీజే జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.  బకాయిలను చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన  వ్యాజ్యాలను సీజే ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. 

మరిన్ని వార్తలు