దివ్యాంగ వలంటీర్‌ కుటుంబానికి ప్రభుత్వం అండ

10 Nov, 2021 05:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగ వలంటీర్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. వివరాలు.. దివ్యాంగురాలైన ఉమ్మనేని భువనేశ్వరి ప్రకాశం జిల్లా ఒంగోలులో వలంటీర్‌గా విధులు నిర్వర్తించేది. ఆర్థిక ఇబ్బందులు, చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం, సోదరి కూడా అనారోగ్యం పాలవ్వడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యింది.

గతేడాది డిసెంబర్‌లో పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పందించారు. బాధితురాలి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కోరారు. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. దీనికి సంబంధించిన చెక్కును వాసిరెడ్డి పద్మ మంగళవారం భువనేశ్వరి తల్లి ఉమ్మనేని జానకికి అందించారు.   

మరిన్ని వార్తలు