చిరు వ్యాపారుల పెట్టుబడికి భరోసా

11 Jan, 2023 03:21 IST|Sakshi

వారి జీవనోపాధికి అండగా నిలుస్తున్న ‘జగనన్న తోడు’ పథకం

నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీటీ.. రూ.10 వేల వరకు వడ్డీలేని రుణం 

3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు

ఇప్పటిదాకా రూ.15,31,347 మందికి రూ.2,406 కోట్లు వడ్డీ లేని రుణాలు  

గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌

నేడు లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి డబ్బు జమ చేయనున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం మహత్తర కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలబడుతూ జగనన్న తోడు పథకం అమలు చేస్తోంది. పూర్తి వడ్డీ భారాన్నీ ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల కొత్త రుణాలు అందించడంతో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను అందించనుంది. సీఎం జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు. 

వారి కష్టాన్ని చూశారు.. ఆదుకున్నారు..
తన సుదీర్ఘ పాదయాత్రలో ఈ చిరు వ్యాపారుల కష్టాలను చూసి, వారి కడగండ్లను స్వయంగా విన్న వైఎస్‌ జగన్‌.. సీఎం కాగానే ఆ పరిస్థితులను మారుస్తూ, నిత్యం కష్టంపైనే ఆధారపడి గౌరవంగా జీవిస్తున్న వారిని ఆదుకోవడం కోసం సున్నా వడ్డీకే రుణాలు అందిస్తూ జగనన్న తోడు పథకం అమలు చేస్తున్నారు.దేశంలో అత్యధికంగా వడ్డీలేని రుణాలు అందిస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. బుధవారం అందిస్తున్న రూ.395 కోట్ల రుణంతో కలిపి ఇప్పటి వరకు రూ.15,31,347 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు రూ.2,406 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించింది.

వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణం పొందిన వారు 8,74,745 మంది. నేడు అందిస్తున్న వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ రూ.15.17 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 13.28 లక్షల లబ్ధిదారులకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.63.65 కోట్లు వడ్డీ చెల్లించింది. ముఖ్యమంత్రి తీసుకున్న చురుకైన చర్యల కారణంగా సకాలంలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి నిత్యం మూలధనం అందుబాటులో ఉంటోంది.

ఏ ఏడాదికి ఆ ఏడాది రుణాల మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.11 వేలకు, రూ.11 వేల నుంచి రూ.12 వేలకు, రూ.12 వేల నుంచి రూ.13 వేలకు పెంచుతూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించేలా చర్యలు తీసుకుంది. 

వీరందరికీ జగనన్న తోడు..
గ్రామాలు, పట్టణాల్లో సు­మా­రు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు, పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్లపై వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్మకుని జీవించేవారు.. రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వ­హించేవారు.. గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారందరికీ జగనన్న తోడు పథకం వర్తిస్తోంది.

సైకిల్, మోటారు సైకిల్, ఆటో­లపై వెళ్లి వ్యాపారం చేసే వారితో పాటు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసేవాళ్లు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీ, లేస్‌ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు కూడా ఈ పథకానికి అర్హులే.   

మరిన్ని వార్తలు