మళ్లీ చదువుల ఒడికి

13 Mar, 2023 02:49 IST|Sakshi

1.47 లక్షల మంది పిల్లలు తిరిగి బడి బాట

సత్ఫలితాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషి.. దారికొస్తున్న డ్రాపౌట్లు 

ప్రత్యేక యాప్‌తో హాజరు నిరంతర పర్యవేక్షణ

వరుసగా మూడు రోజులు రాకుంటే విద్యార్థి ఇంటికి వలంటీర్, విద్యా అసిస్టెంట్‌

కారణాలు తెలుసుకుంటూ సమస్యకు పరిష్కార మార్గాలు

తల్లిదండ్రులతో చర్చించి తిరిగి బడి బాట పట్టిస్తున్న అధికార యంత్రాంగం

పర్యవేక్షణకు పాఠశాలల వారీగా కమిటీల నియామకం

బడి మానేయడానికి గల కారణాలను సీఎం జగన్‌ ఆదేశాలతో సచివాలయాల వారీగా నమోదు

ప్రతి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎస్, ఉన్నతాధికారుల సమీక్ష   

దీర్ఘకాలం డ్రాపౌట్లపై ప్రత్యేక దృష్టి..
దీర్ఘకాలం డ్రాపౌట్స్‌గా గుర్తించిన విద్యా­ర్థు­లకు సంబంధించిన కారణాలను ఇంటింటి సర్వేలో వలంటీర్లు సేకరిస్తున్నారు. బాల్య వివా­హాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బం­దులు, వ్యవసాయ పనులకు వెళ్తు­న్నారా? అనే వివరాలను సేకరించడంతో పాటు తల్లిదండ్రులకు నచ్చచెప్పి చదువుల ద్వారా చేకూరే ప్రయోజనాలను వివరిస్తూ బడిబాట పట్టిస్తున్నారు. ఈ కార్య­క్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు.  

సాక్షి, అమరావతి: కారణం ఏదైనప్పటికీ ఓ చిన్నారి చదు­వులకు దూరమైతే రేపటి తరాలకు పూడ్చలేని నష్టం వాటిల్లుతుంది. ఆ ఒక్క కుటుంబమే కా­కుండా సమాజం మొత్తంపై ఈ ప్రభావం పడుతుంది. పేద కుటుంబాల్లో విద్యా కుసుమాలు వికసించి­న­ప్పుడే దుర్భర దారిద్య్రానికి సంపూర్ణంగా తెర పడు­తుంది. ఒకవైపు విద్యారంగ సంస్కరణలతో చదు­వులను చక్కదిద్ది అడుగడుగునా ప్రోత్సహి­స్తున్నరాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు వివిధ కారణా­లతో స్కూళ్లకు దూరమైన విద్యార్థులపై ప్రత్యే­కంగా దృష్టి సారించింది.

అర్ధాంతరంగా బడి మానే­సిన చిన్నారులను గుర్తించి తిరిగి పాఠశాల బాట పట్టించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 1,47,687 మంది విద్యార్థులను తిరిగి బడిలో చేర్చడం ఇందుకు నిదర్శనం. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, విద్యాకానుక తదితర పథకాలతోపాటు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ విధానం, ఫౌండేషన్‌ స్కూళ్ల ద్వారా చదువులను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.

హాజరు పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌
పాఠశాల వయసు పిల్లలంతా బడిలోనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సచివాలయాలు కేంద్రంగా ఆయా పరిధిలోని స్కూళ్లలో చదివే పిల్లల హాజరును నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా “కన్సిస్టెంట్‌ రిథమ్స్‌’ యాప్‌ను తీసుకొచ్చింది. వరుసగా మూడు రోజుల పాటు పిల్లలు బడికి గైర్హాజరైతే వలంటీర్‌తో పాటు సంక్షేమ, విద్యా అసిస్టెంట్‌ సంబంధిత విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుంటున్నారు. బడికి రాకపోవడానికి కారణాలను వాకబు చేస్తున్నారు. ఏదైనా సమస్య కారణంగా బడి మానేసినట్లు గుర్తిస్తే తగిన పరిష్కార మార్గాలను చూపేలా కృషి చేస్తున్నారు. వారిని తిరిగి పాఠశాలలకు రప్పించేలా చర్యలు చేపడుతున్నారు. 

క్రమం తప్పకుండా సమీక్ష
రాష్ట్రంలో ప్రతి విద్యార్థికీ విద్యారంగ సంస్కరణల ఫలాలు అందేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్న నేపథ్యంలో కొద్దిమంది పిల్లలు మధ్యలో బడి మానేయడానికి కారణాలను సచివాలయాల వారీగా నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి అధికార యంత్రాంగానికి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ పిల్లల డ్రాపౌట్లు, పాఠశాలల్లో చేరికలపై సమీక్ష చేపడుతున్నారు.

మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో స్కూళ్లవారీగా కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. స్కూల్‌ హెడ్మాస్టర్, పేరెంట్స్‌ కమిటీ అధ్యక్షుడు, సంక్షేమ, విద్యా అసిస్టెంట్, గ్రామ ముఖ్యలతో కమిటీలను నియమించారు. ఈ కమిటీ నెలకు ఒకసారి సమావేశమై పాఠశాలల్లో విద్యార్ధుల హాజరుతో పాటు వివిధ వసతులపై సమీక్షిస్తుంది. పిల్లలు మధ్యలో బడి మానేయకుండా తగిన చర్యలు చేపడుతుంది. ప్రతి నెలా కమిటీ సమావేశమై తీసుకున్న చర్యలపై పాఠశాల విద్యాశాఖకు నివేదిక అందచేస్తుంది.

వారంలో ఒక రోజు బడి బాట
ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించిన వివరాలను కన్సిస్టెంట్‌ రిథమ్స్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. సంక్షేమ విద్యా అసిస్టెంట్‌ వారంలో ఒక రోజు తన పరిధిలోని స్కూళ్లను సందర్శించి విద్యార్ధులు హాజరుతో పాటు ఎన్‌రోల్‌మెంట్, మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాలలో సౌకర్యాలను పర్యవేక్షించి వివరాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు.

ఏఎన్‌ఎంలు నెలలో ఒక రోజు స్కూళ్ల వద్దకు వెళ్లి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాక్సినేషన్‌ వివరాలను యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. మహిళా పోలీసులు వారంలో ఒక రోజు స్కూళ్లను సందర్శించి పిల్లల హక్కులు, బాలికల భద్రత తదితర అంశాలను పర్యవేక్షించి వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. వీటిని పరిశీలించి ఎక్కడైనా సమస్యలు, లోపాలుంటే వెంటనే పరిష్కరిస్తున్నారు. సందర్శన ఫోటోలను  యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. పాఠశాలలను ఇలా సూక్ష్మస్థాయిలో నిరంతరం పర్యవేక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం వినియోగిస్తోంది. 

మరిన్ని వార్తలు