గ్రామాల్లో పారిశుధ్యంపై ‘యాప్‌’

1 Nov, 2021 03:33 IST|Sakshi
రూపొందించిన యాప్‌

ఫోటోలు, వీడియోలతో ఫిర్యాదుల స్వీకరణ 

24 గంటల్లో సమస్యకు పరిష్కారం 

పర్యవేక్షణకు కమాండ్‌ కంట్రోల్‌ రూంలు 

పనితీరు ఆధారంగా గ్రామ కార్యదర్శులకు రేటింగ్‌

సాక్షి, అమరావతి: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ సిద్ధం చేసింది. తమ ఇళ్ల పరిసరాల్లో అపరిశుభ్రతపై స్థానికులు మొబైల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా సర్పంచ్‌ ఆధ్వర్యం లో సంబంధిత పంచాయతీ కార్యదర్శి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టింది. గ్రామాలను పరి శుభ్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకునే చర్యల ఆధా రంగా పంచాయతీ కార్యదర్శుల పనితీరుకు రేటింగ్‌ ఇవ్వనున్నారు. యాప్‌ ద్వారా అందే ఫిర్యాదుల పరి ష్కారంపై పర్యవేక్షణకు జిల్లా డీపీవో కార్యాలయాల్లో  కమాండ్‌ కంట్రోల్‌ రూంలతో పాటు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కార్యాలయంలో మరొకటి ఇప్పటికే ఏర్పాటయ్యాయి.

ఫిర్యాదు అందిన తర్వాత 72 గంటలపాటు కంట్రోల్‌ రూం ద్వారా పర్య వేక్షిస్తారు. పరిష్కరించిన తర్వాత ఫిర్యాదుదారుడికి  ఎస్‌ఎంఎస్‌ ద్వారా వివరాలు తెలియజేస్తారు. ఒకవే ళ సంతృప్తి చెందకున్నా, పంచాయతీ కార్యదర్శి ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వకున్నా మరోసారి ఫిర్యాదు చేసే వీలుంది. ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వచ్చే పంచాయతీ కార్యదర్శి పనితీరుపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటారు.

అతి త్వరలో అందుబాటులోకి యాప్‌..
గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ‘జేఎస్‌ఎస్‌’ పేరుతో ఇప్పటికే మొబైల్‌ యాప్‌ సిద్ధమైంది. రెండు మూడు రోజుల్లో ప్లే స్టోర్‌ ద్వారా యాప్‌ అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. తప్పుడు ఫిర్యాదులకు అవకాశం లేకుండా అప్పటికప్పుడు తీసిన ఫోటో లేదా చిన్నపాటి వీడియోను మాత్రమే ఫిర్యాదుతో జోడించేలా యాప్‌ను రూపొందించారు. యాప్‌ ద్వారా పంపిన ఫిర్యాదు వెంటనే సంబంధిత గ్రామ కార్యదర్శికి చేరుతుంది. 24 గంటల తర్వాత మండల స్థాయి ఈవోపీఆర్‌డీకి, 48 గంటల తర్వాత జిల్లా డీపీవో కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూం వద్దకు ఆటోమెటిక్‌గా సమాచారం అందుతుంది.

ఏ అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు?
 క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా గ్రామాలను సైతం పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభించిన విషయం తెలిసిం దే. పల్లెల్లోనూ ప్రతి ఇంటినుంచి చెత్తసేకరణ కార్య క్రమాన్ని చేపడుతున్నారు. తమ ఇళ్ల నుంచి నిర్ణీత గడువు ప్రకారం రోజువారీ చెత్తను సేకరించక పో యినా, రోడ్లపక్కన ఒకేచోట పెద్దమొత్తంలో పేరుకు పోయినా, మురుగు కాల్వలు సక్రమంగా లేకున్నా, మురుగునీటి గుంతలున్నా యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసే వీలుంది. ఫిర్యాదులో వివరాలు నమోదు చేసేలా వీలు కల్పించారు.

ప్రజల భాగస్వామ్యంతో..
గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీలకు అవసరమైన సామగ్రిని ప్రభుత్వ మే అందజేస్తోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరణకు ట్రై సైకిళ్లు, ఆటో రిక్షాలు లాంటివి అన్ని గ్రామాలకు సరఫరా చేసింది. అక్టోబరు 2న జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభమైన  తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 55.41 లక్షల ఇళ్ల నుంచి రోజువారీ చెత్త సేకరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరుగుదొడ్లను శుభ్రం చేసే హై ప్రెజర్‌ క్లీనర్స్, దోమల నివారణకు ప్రతి గ్రామానికి ఒక ఫాగింగ్‌ మిషన్, ఇతర యంత్రాల సరఫరాకు చర్యలు చేపట్టారు. 2022 డిసెంబరు వరకు పంచాయతీరాజ్‌శాఖ పర్యవేక్షించే ఈ కార్యక్రమాలు తర్వాత పంచాయతీ, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతాయి. 

మరిన్ని వార్తలు