Andhra Pradesh: కల్లు కిస్తీలు రద్దు.. ఐదేళ్లకు కల్లుగీత పాలసీ మార్గదర్శకాలు విడుదల

1 Nov, 2022 08:22 IST|Sakshi

గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత 

ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు 

కల్లుగీత పాలసీ 2022–2027 మార్గదర్శకాల విడుదల 

95,245 కల్లుగీత కార్మిక కుటుంబాలకు ప్రయోజనం 

సాక్షి, అమరావతి: ఏపీలో కల్లుగీత వృత్తిపై ఆధారపడిన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐదేళ్ల విధానాన్ని ప్రకటించింది. 2022 నుంచి 2027 వరకు కాలానికి కల్లు గీత విధానం (పాలసీ) అమలులో ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కల్లుగీత లైసెన్సింగ్‌ విధానం కూడా అత్యంత పారదర్శకంగా జరిగేలా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. 

పరిహారం పెంపు.. తాటిచెట్ల పెంపకానికి ప్రాధాన్యత 
► కల్లు రెంటల్స్‌ (కిస్తీలు)ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. రాష్ట్రంలో కల్లుగీత కార్మిక సొసైటీలు, గీచే వానికి చెట్టు పథకం, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో షెడ్యూల్డ్‌ జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం ఐదేళ్లకు అనుమతి(లైసెన్స్‌) ఇస్తారు. 
► కల్లు గీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైన కార్మికులకు ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా తగిన శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపిస్తారు. వైఎస్సార్‌ బీమా ద్వారా నష్టపరిహారం చెల్లిస్తారు. 
► కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు. ఇందులో రూ.5 లక్షలు వైఎస్సార్‌ బీమా ద్వారా, మిగిలిన రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. 
► కల్లు గీత కార్మికుడు సహజ మరణం చెందితే అతని కుటుంబానికి వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల పరిహారం అందజేత. 
► ఎన్‌ఆర్‌ఈజీఎస్, షెల్టర్‌ బెడ్‌ అభివృద్ధి పథకాల కింద తాటి, ఈత వంటి చెట్లను పెంచేలా చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా కాలువ గట్లు, నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లను సమృద్ధిగా పెంచడానికి చర్యలు తీసుకుంటారు.   

మరిన్ని వార్తలు