AP: ఖరీఫ్ సీజన్‌కు కృష్ణా డెల్టా నీటి విడుదల.. నెల ముందుగానే

7 Jun, 2023 10:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఖరీఫ్  సీజన్‌ కృష్ణా డెల్టా నీటిని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిపారుదల శాఖ మంత్రి అంటి రాంబాబు కాలువలకు నీరు విడుదల చేశారు. కృష్ణమ్మకు ప్రజాప్రతినిధులు, అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి.. పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారెను సమర్పించి వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. డిమాండ్‌ను బట్టి మరింత పెంచే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, దూలం నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్  ఢిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు. 

సీఎం జగన్‌ ప్రభుత్వంలో నీటి కొరత లేదు 
ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..
 కృష్ణా, గుంటూరు జిల్లాల కాలువలకు నీరు విడుదల చేసినట్లు తెలిపారు. గతంలో జూన్ నెలాఖరులో కానీ, జూలై మొదటి వారంలో కానీ నీరు వదిలేవారని.. ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నెల ముందే నీరు విడుదల చేశామని పేర్కొన్నారు. త్వరగా ఖరీఫ్ ప్రారంభం కావడం వల్ల మూడు పంటలు పండే అవకాశం ఉందన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి రైతుకు ఇబ్బంది ఉండదని. పులిచింతలలో‌ 34 టీఎంసీల నీరు ఉందని, అక్కడి నుంచే నీటిని రైతులకు అందిస్తున్నాని చెప్పారు.

‘పట్టిసీమ నుంచి కుడా నీరు తెచ్చే అవసరం లేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక నీటి కొరత అనేదే లేదు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి నీరు తెచ్చే అవసరం ఉండదు. దివంగత వైఎస్సార్,  సీఎం జగన్‌ పాలనలో సమృద్ధిగా వర్షాలు పడతాయని నిరూపణ అయ్యింది. వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటే ముందస్తుగా చర్యలు తీసుకుంటాం. కృష్ణా వరదల నుంచి క్షేమంగా ఉండేలా  ప్రజల కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారు. ప్రజల కోసం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించిన వ్యక్తి సీఎం జగన్‌’ అనిపేర్కొన్నారు.
చదవండి: 2024 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయానికి కృషిచేద్దాం

నెల రోజుల ముందే నీటి విడుదల
రైతుల మేలు కోసం నెల రోజుల ముందే నీరు విడుదల చేశామని మంత్రి జోగి రమేష్‌ పేర్కొన్నారు.  సీఎం జగన్‌ నాలుగేళ్ల పాలనలో దేవుడు కరుణించాడని.. వరుణ దేవుడి కరుణా కటాక్షాలతో జలాశయాలు నిండు కుండలా ఉన్నాయని తెలిపారు. రైతులకు పంటలు పండి మంచి దిగుబడి వచ్చిందన్నారు. నాలుగేళ్లల్లో రైతుల నుంచి ధాన్యం కూడా కొనుగోలు చేశారని చెప్పారు.

‘వైఎస్ హయాంలో పులిచింతల  పనులు పూర్తిచేశారు. పులిచింతలలో‌ 34 టీఎంసీల నీరు నిల్వ చేసుకున్నాం. కృష్ణా డెల్టాకు నీటి కొరత లేకుండా ఇస్తున్నాం. పోలవరం వ్యయం పెంచి కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందేలా చేశారు. 12,900 కోట్ల నిధులు కేంద్రం నుంచి తెప్పించగలిగారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏపీ అన్నపూర్ణగా పంటలతో కళకళలాడుతుంది. ఢిల్లీ వెళ్లి ఏం చేశారన్న వారు జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారో తెలుసుకోవాలి’ అని హితవు పలికారు.

మరిన్ని వార్తలు