శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు సీజే 

13 Sep, 2021 05:12 IST|Sakshi
తిరుమలలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న హైకోర్టు సీజే అరూప్‌కుమార్‌ గోస్వామి

తిరుమల/కాణిపాకం: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి ఆదివారం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తీకఫాల్‌ స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి ధ్వజస్తంభానికి మొక్కుకుని, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అదనపు ఈవో, సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టిలు స్వామి వారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని జస్టిస్‌కు అందించారు.  

వినాయకుని సేవలో... 
కాణిపాకం వినాయక స్వామిని జస్టిస్‌ గోస్వామి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో వెంకటేశు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేపట్టారు. ఆశీర్వాద మండపంలో ఆశీర్వచనం ఇప్పించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే, కాణిపాకం వినాయకుడిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
  
వెంకన్న సేవలో ప్రముఖులు  

తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇందులో ఏపీ లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణ్‌ రెడ్డి, ఏపీ సమాచార కమిషనర్‌ రాజా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి ఉన్నారు. 

మరిన్ని వార్తలు