రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ కొత్త యాప్
వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదుకు అవకాశం
అత్యవసర సమయాల్లో వీడియో కాల్ చేసే సౌకర్యం
సాక్షి, అమరావతి : పాలనలో ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పోలీస్ శాఖ సరికొత్త యాప్ను పరిచయం చేసింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ రూపొందించిన కొత్త యాప్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని నేరాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశంతోపాటు ఫిర్యాదులకు రశీదు కూడా పొందే అవకాశం ఉంది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులతో పాటు అత్యవసర సమయాల్లో వీడియో కాల్ చేసే సౌకర్యం కూడా ఉంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. (సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలకు కళ్లెం)
దర్యాప్తు పురోగతి, అరెస్ట్లు, ఎఫ్ఐఆర్లు, రికవరీలు, రహదారి భద్రత,.. సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు. వీటితో పాటు ఎన్వోసీలు, లైసెన్సులు,పాస్పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు అన్ని పోలీసు సేవలను కూడా అందుబాటులో ఉంటాయి. మీడియాలో వైరల్ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ యాప్లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్తో మహిళల కు రక్షణగా, తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ఈ యాప్ సేవలను అందిస్తుంది.
తాడేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్త్ పాటు డీజీపీ గౌతవ్ సవాంగ్ ముఖ్య పోలీసు అధికారులు పాల్గొన్నారు. యాప్ విశిష్టతను సీఎంకు వివరించారు. ఈ యాప్ ద్వారా పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఈ పోలీస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ యాప్ను రూపొందించినట్లు డీజీపీ తెలిపారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ’రాష్ట్రంలోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీ తో ప్రవేశ పెట్టిన దిశ మొబైల్ అప్లికేషన్ (ఎస్ఓఎస్) స్వల్ప వ్యవధి లోనే పదకొండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 568 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించగా 117 ఎఫ్ఐఆర్లను నమోదు చేసి చర్యలు తీసుకున్నాము. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం ఇప్పటికే సైబర్ మిత్ర ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9121211100 మరియు ఫేస్ బుక్ పేజ్ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు 1,850 పిటిషన్ లు అందగా 309 యఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము. సైబర్ నేరాలను నియంత్రించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో సైబర్ల్యాబ్స్ను అందుబాటులోకి తెచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం.అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్హాన్స్మెంట్ వెహికల్స్ (రేస్) విధానం అందుబాటులో ఉంద’న్నారు.
శాంతి భద్రతలు..
♦నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు
♦ఎఫ్ఐఆర్ స్థితిగతులు, డౌన్లోడ్
♦దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు
♦తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు
♦అరెస్టుల వివరాలు
♦వాహనాల వివరాలు
ఎన్ఫోర్స్మెంట్ సేవలు..
♦ఇంటి పర్యవేక్షణ(లాక్మానిటరింగ్ సర్వీసు(ఎల్ఎంఎస్) , ఇ–బీట్)
♦ఈ–చలానా స్టేటస్
పబ్లిక్ సేవలు..
♦నేరాలపై ఫిర్యాదులు
♦సేవలకు సంబంధించిన దరఖాస్తులు
♦ఎన్వోసీ, వెరిఫికేషన్లు
♦లైసెన్సులు, అనుమతులు
♦పాస్పోర్ట్ వెరిఫికేషన్
రహదారి భద్రత..
♦బ్లాక్ స్పాట్లు
♦యాక్సిడెంట్ మ్యాపింగ్
♦రహదారి భద్రత గుర్తులు
♦బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు
ప్రజా సమాచారం..
♦పోలీస్ డిక్షనరీ
♦సమీపంలోని పోలీస్స్టేషన్
♦టోల్ఫ్రీ నంబర్లు
♦వెబ్సైట్ల వివరాలు
♦న్యాయ సమాచారం
♦ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు