వినూత్నంగా స్కూల్‌ క్యాలెండర్‌ 

6 Aug, 2021 15:10 IST|Sakshi

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఎస్సీఈఆర్టీ రూపకల్పన 

పాఠ్యాంశాలతో పాటు పాఠ్యేతర అంశాలకూ పెద్దపీట 

విద్యార్థుల ప్రమాణాల పెంపులో టీచర్లు, తల్లిదండ్రులు, స్థానిక సంస్థల భాగస్వామ్యం 

స్కూల్‌ బ్యాగ్‌ కూడా నిర్ణీత బరువులోనే 

రోజువారీ ప్రణాళికల్లో రంగోత్సవం, కళా ఉత్సవ్, యూత్‌ ఎకో క్లబ్‌ యాక్టివిటీ, స్కూల్‌ మ్యాగజైన్‌ నిర్వహణ కూడా.. 

సాక్షి, అమరావతి: విద్యార్థులను పాఠ్యాంశాలతోపాటు పాఠ్యేతర అంశాల్లోనూ తీర్చిదిద్దేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఓ సరికొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందిస్తోంది. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి బాటలువేసే పలు వినూత్న కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. విద్యార్థుల్లో ప్రమాణాల పెంపు విషయంలో  టీచర్లతో పాటు తల్లిదండ్రులు, స్థానిక సంస్థలు, కమ్యూనిటీలకు భాగస్వామ్యం ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, నైతిక, ఆధ్యాతి్మక పరంగా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఇందులో పలు అంశాలను వివరించారు. అలాగే, విద్యార్థుల రోజువారీ ప్రణాళికల్లో రంగోత్సవం, కళా ఉత్సవ్, దీక్షా యాప్‌ వినియోగం, యూత్, ఎకో క్లబ్‌ యాక్టివిటీ, స్కూల్‌ మ్యాగజైన్‌ నిర్వహణ వంటి కార్యక్రమాలనూ నిర్వహించాల్సి ఉంటుంది. 

స్కూల్‌ పెర్‌ఫార్మెన్సు రిజిస్టర్ల ఏర్పాటు 
ప్రతి స్కూలులో అకడమిక్‌ పెర్ఫార్మెన్స్‌ రిజిస్టర్లను నిర్వహించాలి. పరీక్ష వివరాలు, విద్యార్థుల మార్కులను అందులో నమోదుచేయాలి. విద్యార్థుల సంఖ్య, పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలతో ప్రత్యేక రికార్డులు నిర్వహించాలి. టీచర్లు ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటే మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. పాఠ్యబోధన ఎలా సాగుతోందో తెలుసుకునేలా క్లాస్‌ అబ్జర్వేషన్‌ రిజిస్టర్‌ పెట్టాలి. స్కూలుకు సందర్శకులు వస్తే వారి అభిప్రాయాలు నమోదు చేయాలి. స్కూలులోని మౌలిక సదుపాయాలు, వాటి స్థితిగతులపైనా రికార్డులు నిర్వహించాలి. 

నిర్ణీత బరువులోనే స్కూల్‌ బ్యాగ్‌ 
విద్యార్థి పుస్తకాల బ్యాగ్‌ బరువు నిరీ్ణత ప్రమాణాల్లోనే ఉండాలి. అవి పెరగకుండా చర్యలు తీసుకోవాలి. 1, 2 తరగతుల వారికి 1.5 కిలోలు.. 3–5 తరగతుల వారికి 2–3 కిలోలు.. 6–8 తరగతుల వారికి 4 కిలోలు.. 8–9 తరగతుల వారికి 4.5 కిలోలు.. 10వ తరగతి వారికి 5 కిలోలు మాత్రమే బ్యాగు బరువు ఉండాలని ఎస్సీఈఆర్టీ సూచిస్తోంది.  

ఉపాధ్యాయుల పాత్ర ఇలా.. 

  •  తరగతి గదిలో విద్యార్థులకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేలా బోధన సాగించాలి.  
  • మూల్యాంకన పద్ధతులను అనుసరించి విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో గుర్తించి వారికి తగిన సహకారం అందించాలి. 
  •  పేరెంట్స్‌ కమిటీలను సమావేశపరిచి వారికి విద్యార్థుల స్థితిగతులను, జిల్లాస్థాయిలోని ప్రమాణాల గురించి వివరించాలి.  
  • విద్యార్థులు అంతకుముందు తరగతుల అంశాలను వినకపోయి ఉంటే వాటిని ప్రత్యేకంగా బోధించాలి. 
  • తల్లిదండ్రుల పాత్ర ఇలా.. 
  • విద్యార్థులకు ఇచ్చే హోంవర్క్, వాట్సప్‌ పాఠాలు, ఇతర ప్రక్రియలను ఇంటి నుంచి చేసేలా సహకరించాలి.  
  • దీక్షా యాప్‌ ద్వారా బోధనాంశాలపై అవగాహన పెంచుకునేలా చేయాలి. 
  • ఆటపాటలు, పుస్తక పఠనం వంటి పాఠ్యేతర అంశాలనూ చేయించాలి.  
  • ఇక స్థానిక పంచాయతీ, మున్సిపాలీ్ట, తదితర సంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలనూ క్యాలెండర్లో వివరించారు. కమ్యూనిటీ యాక్టివిటీల కింద రీడింగ్‌ మేళాలు వంటివి నిర్వహించాలి.  
>
మరిన్ని వార్తలు