నాన్నకు ప్రేమతో.. తన తండ్రి పేరు గుర్తుండిపోవాలని..

20 Jul, 2022 15:24 IST|Sakshi

సాక్షి,నరసన్నపేట(శ్రీకాకుళం): తన తండ్రి పేరు గుర్తుండిపోయేలా.. నిత్యం అంతా గుర్తు తెచ్చుకునేలా ఓ కుమారుడు మంచి పని చేశాడు. నరసన్నపేట మండలం సత్యవరం కూడలి వద్ద జాతీయ రహదారికి ఆనుకుని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సుసరాం చెరువును తన తండ్రి పాగోటి రాములు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు పాగోటి రాజారావు బాగు చేయించారు. పూడికతో అధ్వానంగా ఉన్న ఈ చెరువును సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. రూ.50 లక్షలకు పైగా సొంత నిధులు వెచ్చించి ఆదర్శంగా నిలిచా రు. గుర్రపు డెక్క, పూడికతో అధ్వానంగా ఉన్న ఈ చెరువును అభివృద్ధి చేయాలని సత్యవరం గ్రామస్తులు అధికారుల చుట్టూ తిరిగారు.

ప్రయోజనం లేకపోయింది. వర్షాలు అధికమైతే చెరువు నీరు పొలాల మీదకు వచ్చి పంటలను నష్ట పరుస్తుండేది. ఈ దశలో చెరువును అబివృద్ధి చేయాలని రాజారావును గ్రామస్తులు కోరగా ఆయన ముందుకు వచ్చి పనులు చేపట్టారు. దీంతో చెరువు రూపురేఖలు మారిపోయాయి. రెండు నెలల కిందట అధ్వానంగా కనిపించిన చెరువు ఇప్పుడు అందంగా మారింది. అలాగే మరో రూ. 5 లక్షలు వెచ్చించి వంద అడుగుల వెడల్పుతో మెట్లు నిర్మించారు. గట్టు చుట్టూ 200 కొబ్బరి మొక్కలు వేయించారు.

సత్యవరం గ్రామస్తులతో పాటు నరసన్న పేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ పాగోటి రాజారావును అభినందించారు. గ్రామాల్లో దాతలు ఈ విధంగా ముందుకు వచ్చి పూడుకుపోయిన చెరువులు అభివృద్ధి చేయాలని, భూగర్భ జలాలను పెంపొందించేందుకు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాగా ఈ చెరువులో బోట్‌ షికార్‌ చేసేందుకు పంచాయతీ ఏర్పాట్లు చేస్తోంది. రాజారావు బోట్లను సమకూర్చుతుండగా దీని నిర్వహణ బాధ్యత పంచాయతీ తీసుకుంటుందని సర్పంచ్‌ బూరల్లి శంకర్‌ తెలిపారు.

చదవండి: Extramarital Affair: మహిళతో వివాహేతర సంబంధం.. కొన్నాళ్లు గడిచాక..    

మరిన్ని వార్తలు