ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం 

6 Mar, 2023 04:27 IST|Sakshi

గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం 

జాతీయ సగటుకు మించి 100% వ్యాక్సినేషన్‌ 

ఏపీలో 99.9 శాతం ఆస్పత్రుల్లోనే కాన్పులు 

నూటికి నూరు శాతం యాంటి నేటల్‌ చెకప్‌లు 

బడికి వెళ్లే బాలబాలికలకు ఐరన్‌ ట్యాబ్లెట్లు 

రాష్ట్రాల్లో 2021–22 వైద్య సేవలపై కేంద్రం నివేదిక   

సాక్షి, అమరావతి: గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. అటు కాబోయే అమ్మలకు, ఇటు పిల్లలకు రోగ నిరోధక టీకాలివ్వడంలో మొదటి స్థానంలో ఉంది. ఆస్పత్రుల్లో కాన్పులు, నవజాత శిశువులకు 24 గంటల్లో హెపటైటిస్‌–బి డోసులివ్వడం, గర్భిణులకు యాంటి నేటల్‌ చెకప్‌ల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. పిల్లలకు, పోలియో టీకాలు అందించడంలోనూ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. 2021–22లో వివిధ రాష్ట్రాల్లో వైద్య సేవలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.    

నివేదికలోని కీలక అంశాలు
జాతీయ స్థాయిలో గర్భిణులకు రోగ నిరోధక టీకాలు 86.5 శాతం ఇవ్వగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో నూటికి నూరు శాతం వ్యాక్సిన్లు ఇచ్చారు. తమిళనాడు, దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ –డయ్యూ, మహారాష్ట్ర ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.  
9 నుంచి 11 నెలల వయసున్న చంటి బిడ్డలకు రోగ నిరోధక టీకాలివ్వడంలోనూ ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మొదటి స్థానంలో ఉంది. జాతీయ సగటు 91 శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో నూటికి నూరు శాతం చిన్నారులకు రోగ నిరోధక వ్యాక్సి­న్లు ఇచ్చారు. గుజరాత్, జమ్మూ– కశీ్మర్, జార్ఖండ్, మహారాష్ట్ర తరువాత స్థానాల్లో నిలిచాయి. 
 పిల్లలకు పోలియో చుక్కలు వేయడంలో జాతీయ సగటు 87.1 శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో నూరు శాతం నమోదైంది. హెపటైటిస్‌–బి డోస్‌లకు సంబంధించి  జాతీయ సగటు 75.8 % కాగా ఆంధ్రప్రదేశ్‌లో 98.4 %ఉంది.  
 ఆస్పత్రుల్లో ప్రసవాల జాతీయ సగటు 95.5 శాతం కాగా రాష్ట్రంలో 99.9 శాతం ఆస్పత్రుల్లోనే కాన్పులు జరుగుతున్నాయి.  
 పూర్తిగా రోగ నిరోధక వ్యాక్సిన్లు 9,14,644 
మంది గర్భిణులకు ఇచ్చారు.  
 9 – 11 నెలల వయసున్న 8,42,404 మంది చిన్నారులకు టీకాలిచ్చారు.  
పాఠశాలలకు వెళ్లే 2,58,68,458 మంది బాలికలు, 2,58,19,968 మంది బాలురకు,  అంగన్‌వాడీ కేంద్రాల్లో 4,33,490 మంది బాలికలకు ఐఎఫ్‌ఐ మాత్రలను అందించారు. రాష్ట్రంలో 1,16,80,448 మంది కౌమార బాలికలకు శానిటరీ న్యాప్‌కిన్లను అందించి బాలికా విద్యను ప్రభుత్వం ప్రోత్సహించింది. 

మరిన్ని వార్తలు