దూసుకెళ్తున్న వాహన విక్రయాలు

2 Aug, 2021 05:15 IST|Sakshi

రాష్ట్రంలో తొలి త్రైమాసికంలోనే 1.60 లక్షల ద్విచక్ర వాహనాల కొనుగోలు

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ద్విచక్ర వాహనాల్లో 47 శాతం వృద్ధి

మూడు నెలల్లో 18,999 కార్లు కొన్నారు..

గూడ్స్, ప్యాసింజర్‌ వాహనాలు, ఆటోల కొనుగోళ్లలోనూ పురోగతి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వాహన విక్రయాలు దూసుకెళ్తున్నాయి. గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కోవిడ్‌ లాక్‌డౌన్, ఆంక్షలతో వాహన విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే, ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వాహన విక్రయాలు జోరుగా జరిగాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో ఏకంగా 1.60 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు జరిగాయి. ఇదే గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో చూస్తే 1.09 లక్షల ద్విచక్ర వాహనాలు కొనుగోళ్లు జరిగాయి. అంటే 47.09 శాతం వృద్ధి నమోదైంది. కార్ల కొనుగోళ్లలో గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో 303.20 శాతం వృద్ధి నమోదైంది. అలాగే గూడ్స్, ప్యాసింజర్‌ వాహనాలు, ఆటోల కొనుగోళ్లు కూడా గత ఆర్థిక ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారీ వృద్ది నమోదైంది.

ఈ ఏడాది మెరుగు
గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కోవిడ్‌ లాక్‌డౌన్‌తో రవాణా రంగం ద్వారా సగానికిపైగా ఆదాయం పడిపోయింది. అయితే, ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో గత ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే రవాణా రంగం ఆదాయంలో 77.50 శాతం వృద్ధి నమోదైందని రవాణా శాఖ అదనపు కమిషనర్‌ ప్రసాదరావు తొలిపారు. గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రవాణా రంగం ద్వారా కేవలం రూ.367.13 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.651.68 కోట్లు ఆదాయం వచ్చింది. కోవిడ్‌ తగ్గుముఖం పడితే మరింత ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రసాదరావు పేర్కొన్నారు.  వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు ఇంకా పెరుగుతాయన్నారు. 

మరిన్ని వార్తలు