వేసవిని తలపిప్తోన్న వానాకాలం! 

4 Aug, 2021 03:12 IST|Sakshi

మరో మూడు రోజులు ఇవే పరిస్థితులకు అవకాశం  

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టులో ఇటీవల కాలంలో లేనంతగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలో 37.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా.. ఉక్కపోత వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

ఆగస్టు రెండో వారం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు పడే సూచనలున్నట్లు తెలిపారు. కోస్తా తీరం వెంబడి రానున్న 3 రోజుల్లో ఉపరితల ద్రోణి ఏర్పడనుందని..దీనికి అనుబంధంగా ఈ నెల 7న మచిలీపట్నం సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ఉభయగోదావరి జిల్లాల మీదుగా కదులుతూ తెలంగాణ వైపు ప్రయాణించనుందని దీని ప్రభావంతో ఈ నెల 11 నుంచి 22 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగానూ, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు.  

రెండు రోజుల పాటు వర్ష సూచనలు 
ఏపీలో పడమర, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా రాగల 2 రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచన ఉందని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.   

మరిన్ని వార్తలు