ఈ ఏడాదిలోనే నేరడి బ్యారేజీకి శంకుస్థాపన 

3 Jul, 2021 08:46 IST|Sakshi
నేరడి వద్ద శంకుస్థాపన స్థలాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మంత్రి అనిల్‌కుమార్‌ తదితరులు

2024కు పూర్తి: మంత్రి అనిల్‌ 

పాలకొండ రూరల్‌/అరసవల్లి: శ్రీకాకుళం జిల్లా భామిని మండలం నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణ పనులకు ఈ ఏడాదిలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ చెప్పారు. ఆయన శుక్రవారం జిల్లాలో పర్యటించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి నేరడిలో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. 2024 నాటికి బ్యారేజీ పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఇది పూర్తయితే ఏపీలో 2 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు.

ఏటా సముద్రంలో కలిసే 100 టీఎంసీలతో పాటు ఒడిశా నుంచి సమకూరే 50 టీఎంసీల నీటినీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చని, తద్వారా దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంటలు పండి జిల్లా సస్యశ్యామలమవుతుందని తెలిపారు. అనంతరం మంత్రి అనిల్‌.. హిరమండలంలోని వంశధార ప్రాజెక్టును పరిశీలించి, పనుల పురోగతిపై ఆరాతీశారు. ఖరీఫ్‌కు నీరందించాలని చెప్పారు. అనంతరం శ్రీకాకుళంలోని జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,  కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు