విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌

27 Jul, 2022 21:04 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: వైజాగ్‌ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసులో మరో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. ఇప్పటిjకే  భర్త శ్రీనివాస్‌​కు మస్కా కొట్టి లవర్‌తో పరారైన సాయిప్రియ తాజాగా తను క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు వెల్లడించింది. అంతేగాక ప్రియుడు రవిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. తాళిబొట్టుతో ఉన్న ఫోటోను తల్లిదండ్రులకు వాట్సప్‌లో పంపించింది. అలాగే ఓ వాయిస్‌ మెసెజ్‌ పంపింది.

‘నాన్న.. నేను సాయిని మాట్లాడుతున్నాను. నేనేం చచ్చిపోలేదు. బతికే ఉన్నాను. నేను రవితోనే ఉన్నాను. నన్నేం రవి బలవంతంగా తీసుకెళ్లలేదు. మా ఇద్దరికీ పెళ్లి కూడా అయిపోయిది. దయచేసి నాకోసం వెతకొద్దు నాన్న నీకు పుణ్యం ఉంటది. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు. చావు అయినా బతుకైనా రవితోనే ఉంటాను. ప్లీజ్‌ మమ్మల్ని వెతకద్దు ఒకవేళ నా కోసం వెతికితే చనిపోతా. రవి పేరెంట్స్‌ను ఏమీ చేయొద్దు’ అంటూ వాయిస్‌ మెసేజ్‌ చేసింది. ఇక సముద్రంలో గల్లంతైందని భావించి రెండు రోజులుగా భార్య కోసం ఎదురు చూస్తున్న శ్రీనివాస్‌కు, ఆయన తల్లిదండ్రులకు సాయిప్రియ పెద్ద షాక్‌ ఇచ్చినట్లు అయ్యింది.
సంబంధిత వార్త: ఆర్కే బీచ్‌లో వివాహిత అదృశ్యం కేసులో ఊహించని ట్విస్టు

కాగా సాయి ప్రియ, శ్రీనివాస్‌​  భార్యభర్తలు. విశాఖపట్నంలోని సంజీవ నగర్‌లో ఉంటున్నారు. అయితే సాయిప్రియ కొంతకాలంగా శాంతినగర్‌కు చెందిన రవితో ప్రేమాయణం సాగిస్తోంది. సోమవారం పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లింది. అక్కడ భర్త కళ్లు గప్పి సాయిప్రియ ప్రియుడితో కలిసి బీచ్‌ నుంచి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సముంద్రంలో కోట్టుకుపోయి ఉంటుందని కంగారు పడి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వివాహిత కోసం రెండు కోస్ట్‌ గార్డ్‌ షిప్‌లతో పాటు ఓ హెలికాప్టర్‌తో సముద్రం మొత్తం గాలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం సాయిప్రియ బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు