‘అంతర్వేది’ రథ నిర్మాణం ప్రారంభం

28 Sep, 2020 05:24 IST|Sakshi
నూతన రథం నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, మంత్రి వేణు, ఎంపీ అనురాధ, ఎమ్మెల్యేలు తదితరులు

నిర్విఘ్నంగా పూర్తయ్యేందుకు శ్రీ సుదర్శన నారసింహ మహాశాంతి హోమం

పనులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, మంత్రి వేణు

మలికిపురం: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇటీవల దగ్ధమైన రథం స్థానంలో నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధానార్చకుడు పి.కిరణ్, అర్చక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పనులు ప్రారంభించారు. రథం తయారీకి వినియోగించే టేకు కలపకు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. సుమారు రూ. కోటి వ్యయంతో ఈ రథాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే రథం తయారీకి అవసరమైన ఖరీదైన బస్తర్‌ టేకు కలపను రావులపాలెంలో కొనుగోలు చేసి, ఆలయం వద్దకు తరలించారు. 

► రథం పనులు నిర్విఘ్నంగా పూర్తి కావాలని కోరుతూ ఆలయం ఎదుట ఉన్న కల్యాణ మండపంలో తొలుత శ్రీ సుదర్శన నారసింహ మహాశాంతి హోమం వైభవంగా నిర్వహించారు. 
► మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. రానున్న స్వామివారి కల్యాణోత్సవాల నాటికి ఎటువంటి ఆటంకాలూ లేకుండా రథం తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 
► కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, ఎంపీ అనురాధ, ఎమ్మెల్యేలు రాపాక, సతీష్‌కుమార్,  చిట్టిబాబు, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు