ఫిబ్రవరిలోగా అంతర్వేది రథ నిర్మాణం

7 Sep, 2020 19:55 IST|Sakshi

అంతర్వేది ఆలయ ఈవో బదిలీ

సాక్షి, విజయవాడ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవ‌దాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పెదపాటి అమ్మాజీతో క‌లిసి ఆయ‌న సోమవారం మాట్లాడారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా....కావాలని ఎవరన్నా చేసిందా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 ల‌క్ష‌ల రూపాయ‌లతో అంతర్వేది రథం నిర్మాణం జ‌రిగే విధంగా ఆదేశాలు జారీ చేసిన్న‌ట్లు తెలిపారు. (అంతర్వేది ఆలయ రథం దగ్ధం)

 హిందువుల దేవాలయాల గురించి టీడీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. పుష్కరాల వంకతో 40 గుళ్లు కూల్చేసిన చంద్రబాబు... గోదావరి పుష్కరాల్లో 23మందిని పొట్టనపెట్టుకున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతర్వేది ఘటనపై నిజ నిర్దారణ కమిటీ వేసిన చంద్రబాబు.. పుష్కరాల్లో 23 మందిని పొట్టన పెట్టుకున్నపుడు ఎందుకు నిజ నిర్ధారణ వేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో జరగకుండా ప్రతి దేవాలయంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రతిపక్షాలు కుట్ర చేశాయనే అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని ఒక కులానికి అంటగట్టాలని చూస్తున్నారని మంత్రి వెలంపల్లి అన్నారు. శాసనమండలిలో నారా లోకేష్‌కు సవాల్‌ విసిరితే పారిపోయారని, అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించడమా అని ఎద్దేవా చేశారు.

రథం దగ్ధం ఘటనపై ఆలయ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశామని అలాగే ఈవోని బదిలీ చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే అంతర్వేదిలో  సీసీ కెమెరా విభాగం చూసే ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. విజయవాడ దుర్గగుడిలో జరిగిన క్షుద్ర పూజలపై విచారణ చేయిస్తున్నామని, హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండ చూస్తామని, రాజకీయ కోణంలో కావాలని కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నమ్మవద్దు అని ప్రతి ఒక్కరికి కోరుతున్నమని మంత్రి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు