రఘురామను రమేష్ ఆస్పత్రికి పంపమనడంపై ఏఏజీ అభ్యంతరం

16 May, 2021 22:02 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును రమేష్ ఆస్పత్రికి పంపడమంటే టీడీపీ ఆఫీస్‌కు పంపినట్టేనని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని అతని తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

గతంలో రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్థావించారు. తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడిచే రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం, వారు చెప్పిందే నివేదికగా ఇచ్చే అవకాశం ఉందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు స్వయంగా జీజీహెచ్ బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రైవేట్ వైద్యులు, సీఆర్పీఎఫ్ భద్రత, కుటుంబ సభ్యులు ఉంటారని వెల్లడించారు. 

ఇందుకు సంబంధించిన ఆదేశాలను హైకోర్టు నిన్న సాయంత్రం 6:40కే వెల్లడించిందని తెలిపారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చాక రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని సీఐడీ కోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని ఆయన వివరించారు. ఈ అంశాన్ని సీఐడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. హైకోర్టు ఆర్డర్ కాపీ ఇస్తే తమ తీర్పును సవరిస్తామని సీఐడీ కోర్టు తెలిపిన విషయాన్ని ఆయన వెల్లడించారు.
చదవండి: ‘రఘురామకృష్ణరాజు ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు’

మరిన్ని వార్తలు