సొంత డెయిరీ కోసం సహకార డెయిరీలు ఖూనీ
హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీ మూసేసిన ఘనత చంద్రబాబుదే
అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంపై అసెంబ్లీలో సీఎం జగన్
బాబు అధికారంలో ఉంటే హెరిటేజ్ షేర్ పరుగులు పెట్టింది
అలా పెరగడం అంటే రిగ్గింగ్ చేశారనాలా?
అయినా మా లక్ష్యం చంద్రబాబు కాదు..
అమూల్తో ఒప్పందం ద్వారా పాలకు అధిక ధర చెల్లింపు, ఆపైన బోనస్
రూ.3 వేల కోట్లతో గ్రామాల్లో పాల సేకరణకు ఏర్పాట్లు
‘అమూల్ వల్ల హెరిటేజ్ చావదు. వేరే రాష్ట్రాలకు వెళ్లి పాలు సేకరిస్తుంద’ని నిన్న లోకేష్ ఏదో టీవీలో అన్నారట. అంటే అర్థం వారు ఇంత కాలం తక్కువ ధర ఇస్తున్నారనే కదా? చంద్రబాబు మీద కోపంతోనో, హెరిటేజ్ టార్గెట్గానో అమూల్ను తేలేదు. మా రాడార్లో చంద్రబాబు లేరు. మా లక్ష్యం చంద్రబాబు కాదు. మా మైండ్ సెట్ కూడా అది కాదు. అక్క చెల్లెమ్మలకు మేలు చేయాలి.. చేయూత ఇవ్వాలనే అరాటంతోనే అమూల్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
చేయూతలో దాదాపు 24.55 లక్షల అక్క చెల్లెమ్మలకు, ఆసరాలో దాదాపు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు డబ్బు ఇస్తున్నాం. ఈ డబ్బును సరైన పద్దతిలో రిస్క్ లేని చోట పెట్టిస్తే వారికి రెగ్యులర్గా ఆదాయం వస్తుంది. దాని వల్ల వారు లక్షాధికారులు అవుతారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుంది. ఈ సమున్నత ఆశయం, ఆరాటంతోనే అమూల్, ఐటీసీ, రిలయన్స్ లాంటి సంస్థలను తీసుకొచ్చాం. అంతే తప్ప, చంద్రబాబు, హెరిటేజ్లను దెబ్బ తీయాలని కాదు. మాది అంత చౌకబారుగా ఆలోచించే తత్వం కాదు'
-వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 27 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఆర్థిక, వ్యాపార ప్రగతి, ప్రజలకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తుల సరఫరా లక్ష్యంగా దేశంలోనే అతి పెద్ద సహకార డెయిరీ ‘అమూల్’తో ఒప్పందం కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 50 దేశాల్లో పోటీ పడుతున్న అతి పెద్ద సహకార డెయిరీ అమూల్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉందని, ఇందులో రైతులే వాటాదారులని పేర్కొన్నారు. అధిక ధరకు పాలు కొనుగోలు చేయించడం ద్వారా పాడి రైతులు, అక్క చెల్లెమ్మల ఆదాయం పెంచడమే కాకుండా లాభాల్లో బోనస్ కూడా ఇప్పించడం కోసమే ప్రభుత్వం అమూల్ను తీసుకొచ్చి ఒప్పందం చేసుకుందని వివరించారు. గత పాలకులు సొంత డెయిరీలకు లాభాలు పండించడం కోసం సహకార రంగంలోని డెయిరీలను చంపేస్తే తాము అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేసేందుకు, వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు అమూల్, ఐటీసీ, రిలయన్స్ లాంటి సంస్థలను తెచ్చామని సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం (ఎంఓయూ)పై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చ సందర్భంగా సహకార రంగంలోని డెయిరీలను చంద్రబాబు సర్కారు ఖూనీ చేసిన తీరును సీఎం జగన్ ఆధార సహితంగా ఎండగట్టారు. ప్రస్తుత ప్రభుత్వం పాడి రైతులు, అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు తీసుకుంటున్న చర్యలను, అమూల్ను తేవడంవల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ‘నా పాదయాత్ర సందర్భంగా కొందరు మినరల్ వాటర్ బాటిల్ చూపించి రూ.21కి కొన్నామన్నారు. లీటరు పాలకు కూడా దాదాపు అదే ధర వస్తోందని చెప్పారు. మినరల్ వాటర్తో సమాన ధరకు వారు పాలు అమ్ముకోవాల్సి రావడం దారుణం. పశువులను అమ్ముకుందామనుకున్నామని, ఇప్పుడు మంచి ధర వస్తుందనే నమ్మకం కలిగిందని మొన్న ‘ఏపీ - అమూల్’ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేశారు’ అని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి?
- రాష్ట్రంలో పాలు పోసే వారికి ఒక పద్ధతి ప్రకారం మంచి ధర రానివ్వకుండా చేశారు. అలా సహకార రంగాన్ని ఒక పద్ధతి ప్రకారం చంపేశారు. సహకార డెయిరీలను ఖూనీ చేసి ప్రయివేటు డెయిరీలు ఏకమై స్వార్థంతో ఒకే ధర నిర్ణయిస్తున్నాయి. అంతకు మించి ఇవ్వబోమంటున్నాయి.
- దీంతో వాటికి పోలు పోయడం లేదా పాడి పశువులను అమ్ముకోవడం తప్ప రైతులకు, అక్క చెల్లెమ్మలకు గత్యంతరం లేకుండా పోయింది. ఒక వ్యక్తి ప్రైవేటు డెయిరీ స్థాపించి దాన్ని లాభాల్లో ముంచాలనే స్వార్థంతో రాష్ట్రంలోని మొత్తం సహకార రంగాన్ని చంపేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ఇందుకు ఆ ఒక్క వ్యక్తి స్వార్థమే కారణం.
‘మ్యాక్స్’ చట్టంతో గ్రహణం
- 1974 వరకు డెయిరీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవగా, ఆ ఏడాడే డెయిరీ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తెచ్చారు. 1981లో డెయిరీ రంగంలో మూడంచెల సహకార వ్యవస్థ (త్రీ టయర్ కో ఆపరేటివ్ సెక్టార్) ఏర్పడింది. దాంతో 9 సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి.
- అక్కడి నుంచి వీటి ప్రయాణం బాగా సాగింది. 1992లో హెరిటేజ్ డెయిరీ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 1995లో ‘పరస్పర సహాయ సహకార సంఘాల’ (మ్యాక్స్) చట్టం తెచ్చారు. దీంతో సహకార డెయిరీలకు గ్రహణం పట్టింది.
- 1999లో విశాఖ డెయిరీని, 2001లో కృష్ణా డెయిరీని, 1997లో గుంటూరు డెయిరీని, 2002లో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు సహకార రంగంలోని డెయిరీలను మ్యాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చారు. ఏదైనా సొసైటీ లేదా యూనియన్ మ్యాక్స్కు మారాలి అంటే, ఆయా సహకార సంస్థల్లో ఉన్న ప్రభుత్వ వాటా, ఆస్తులను వెనక్కు ఇవ్వాలి. లేదా రీఫండ్కు సంబంధించి ప్రభుత్వంతో అవగాహన (ఎంఓయూ) చేసుకోవాలి.
- అయితే ఆ నియమాలన్నింటినీ తుంగలో తొక్కి విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల డెయిరీలను చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా మ్యాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చింది.
ఇది ఇంకా అన్యాయం
- అది ఒక రకమైన అన్యాయమైతే విశాఖ జిల్లా సహకార సంఘాన్ని 2006లో.. గుంటూరు, ప్రకాశం జిల్లాల సహకార సంఘాలను 2013లో ప్రొడ్యూసర్ కంపెనీల కింద మార్చేయడం ఇంకా అన్యాయం. కంపెనీల చట్టంలో ఇలాంటి అవకాశం లేకపోయినా సహకార సంస్థలను ప్రైవేటు యాజమాన్యాల గుప్పెట్లోకి తెచ్చేందుకు వ్యవస్థను దిగజార్చారు.
- ఇవాళ ఉభయ గోదావరి, వైఎస్సార్ కడప, చిత్తూరు, అనంతపురం డెయిరీలు ఏపీ సహకార సంఘాల పరిధిలో ఉంటే కృష్ణా, నెల్లూరు, కర్నూలు డెయిరీలు మ్యాక్స్ చట్టం కింద.. గుంటూరు, ప్రకాశం, విశాఖ డెయిరీలు కంపెనీల చట్టం పరిధిలో ఉన్నాయి.
- ఇలా ఒక పద్ధతి ప్రకారం సహకార రంగంలోని డెయిరీలను సర్వనాశనం చేశారు. ఇవాళ ఎవరైనా సంగం డెయిరీని సహకార రంగంలోని డెయిరీ అని చెబుతారా? ధూళిపాళ్ల నరేంద్ర అనే వ్యక్తి దాన్ని ప్రైవేటు సంస్థలా నడుపుతున్నారు. ఆ విధంగా సహకార రంగాన్ని ఒక పద్ధతి ప్రకారం ఖూనీ చేశారు.
హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీ మూసివేత
- చంద్రబాబు దగ్గరుండి సహకార డెయిరీలను ఖూనీ చేశారు. చిత్తూరు డెయిరీ ఒకప్పుడు ‘హెరిటేజ్’కి పోటీ పడిందని, 2003లో దానిని మూసేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు ఇలా ఉన్నాయి. (క్లిప్పింగ్ ప్రదర్శించారు - సీఎం చదివి వినిపించారు)
- ‘చంద్రబాబుకు కావాల్సిన మనిషి దొరబాబు. ఆయనను బీఎస్ రాజ నర్సింహులు అని కూడా అంటారు. ఆయనను చిత్తూరు డెయిరీ చైర్మన్ను చేసి చంద్రబాబు చక్రం తిప్పారు. చిత్తూరు డెయిరీని ఆయన విజయవంతంగా మూసి వేయించారు. అందుకు రివార్డుగా చంద్రబాబు ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. ఏ రకంగా సహకార రంగాన్ని మూసి వేయించారనడానికి ఇది ఒక ఉదాహరణ’.
అధికారంలో ఉంటే హెరిటేజ్ లాభాల పరుగు
► - చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ లాభాలు, షేర్ విలువ భారీగా పెరుగుతాయి. ఆయన అధికారం నుంచి దిగిపోతే తగ్గిపోతాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ ప్రకారం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 1999 జనవరి 1న రూ.2.89 ఉన్న హెరిటేజ్ షేర్ ధర 2003 డిసెంబర్ 12 నాటికి ఏకంగా రూ.26.90కు పెరిగింది.
► - ఆ తర్వాత 2009 ఏప్రిల్ 9 నాటికి హెరిటేజ్ షేర్ ధర రూ.16.35కు పడిపోయింది. అనగా చంద్రబాబు అధికారంలో లేనప్పుడు హెరిటేజ్ షేర్ రూ.పదికిపైగా పడిపోయింది.
- ‘సైకిల్ కాంగ్రెస్’ సర్కారు (కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు)లో ఈ సంస్థ షేర్ రూ.35 నుంచి రూ.100కు పెరిగింది. చంద్రబాబు విప్ జారీ చేసి మరీ కిరణ్ సర్కారును కాపాడిన విషయం గమనార్హం.
► - 2014లో ఆ పెద్దమనిషి చంద్రబాబు సీఎం అయ్యాక రూ.100 ఉన్న హెరిటేజ్ షేర్ ధర 2017 డిసెంబర్ నాటికి రికార్డు స్థాయిలో రూ.827కు పెరిగింది.
► - ఆయన సీఎంగా ఉన్నప్పుడు షేర్ విలువ ఇలా పెరగడాన్ని ఏమనాలి? షేర్ రిగ్గింగ్ చేశారేమో! బాబు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత 2020 మార్చి నాటికి హెరిటేజ్ షేర్ ధర మళ్లీ రూ.205కు పడిపోయింది.
ఇదెక్కడి నిబంధన?
- చంద్రబాబు సీఎంగా ఉండగా 2016 డిసెంబర్ 30న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)తో హెరిటేజ్ ఎంఓయూ కుదుర్చుకుందని ఏఎన్ఐ రిపోర్టు చేసింది. రైతులకు సులభ రుణాల పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడా - హెరిటేజ్ ఈ ఒప్పందం చేసుకున్నాయి.
- బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న వారు హెరిటేజ్ డెయిరీకే పాలు పోయాలనే దారుణమైన నిబంధన పెట్టారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? సీఎంగా చంద్రబాబు ఏవిధంగా పరిపాలన సాగించారనడానికి ఇది ఒక మచ్చుతునక.
- సహకార రంగం బలంగా ఉంటే పోటీ ఏర్పడి పాల సేకరణ ధర పెంచుతాయి. దీనివల్ల పాడి రంగంలో ఉన్న 27 లక్షలకు పైగా అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం చేకూరుతుంది. అందుకే మనం ప్రజలకు మేలు చేయడం కోసం అమూల్ను తేవడానికి కష్టపడ్డాం.
- ఒకవేళ అమూల్ రాకపోతే పరిస్థితి దారుణంగానే ఉండిపోయేది. రాష్ట్రంలో మెజారిటీ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు మూత పడ్డాయి. కేవలం 800 గ్రామాల్లోనే పాల సేకరణ సాగుతోంది. చాలా డెయిరీలు మూతబడ్డాయి. జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఉంది.
- ప్రైవేటు రంగంలోని డెయిరీలకు పోటీ లేకుండా పోయింది. ఇవి అనుసరిస్తున్న అనైతిక పద్ధతులు, పాడి రైతుల్లో అవగాహన లేమి వల్ల సహకార రంగం కుదేలైంది. సహకార డెయిరీలు ప్రయివేటు వ్యక్తుల కబంధ హస్తాల్లోకి వెళ్లాయి.
అమూల్తో ఒప్పందం
- వీటన్నింటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 2020 జూలై 21న అమూల్తో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా సాధికారత లక్ష్యంతోనే ఈ ఒప్పందం చేసుకున్నాం. రైతుల నుంచి పాలను అధిక ధరకు కొనుగోలు చేయించడం ఈ ఒప్పందం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.
- మంచి ధరతో పాలు కొనుగోలు చేయడమే కాకుండా ‘అమూల్’ లాభాల్లో కూడా రైతులకు ఏటా రెండు సార్లు వాటా ఇప్పిస్తాం. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇదెంతో దోహదపడుతుంది. దీనివల్ల వినియోగదారులకు కూడా నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు లభిస్తాయి.
- అమూల్ను మార్కెటింగ్ అనుసంధానం కోసం వినియోగించుకుంటాం. మహిళలల్లో సహకార విప్లవం తేవాలన్న తపన దీని వెనుక ఉంది. ప్రతి గ్రామంలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
- గ్రామాల్లో అమూల్ ఎక్కువ ధరకు పాలు కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, అమ్మి లాభాలు గడించి, ఆ లాభాల్లో వాటాలను బోనస్గా అక్క చెల్లెమ్మలకు ఇస్తుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. అమూల్ అనేది దేశ సహకార రంగంలో పని చేస్తున్న అత్యంత ఉత్తమమైన సహకార సంస్థ.
- రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఆయా గ్రామాల్లో రూ.16.90 లక్షలతో భవనం, రూ.10 లక్షలతో బీఎంసీయూ, రూ.1.40 లక్షలతో ఆటోమేటిక్ పాల సేకరణ యూనిట్.. మొత్తం రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. వీటన్నింటి ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలు మారిపోతాయి.
- అమూల్ సేకరించే పాలకు పది రోజులకు ఒకసారి అమ్మకందారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బు జమ చేస్తుంది. లంచాలు, దళారుల మాటే ఉండదు. తొలి దశలో వైఎస్సార్ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 400 గ్రామాల్లో పాల సేకరణ మొదలైంది.
- ఇప్పటికే 7 వేల ఆవులు, గేదెలు పంపిణీ చేశాం. 2021 ఫిబ్రవరి నాటికి లక్ష యూనిట్ల ఆవులు, గేదెలు ఇస్తాం. 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి వరకు మరో 3.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు ఇస్తాం.
అమూల్ ఇచ్చే ధర ఎంత ఎక్కువంటే...
- లీటరు గేదె పాలను (6 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) హెరిటేజ్ సంస్థ రూ.33.60తో, దొడ్ల డెయిరీ రూ.34.20, జెర్సీ సంస్థ రూ.34.80తో కొనుగోలు చేస్తుండగా, అమూల్ రూ.39కి కొనుగోలు చేయనుంది.
- 10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్ ఉన్న గేదె పాలను సంగం, హెరిటేజ్ సంస్ధలు రూ.58తో, జెర్సీ సంస్థ రూ.60కి కొనుగోలు చేస్తుండగా, అమూల్ రూ.64.97కు కొనుగోలు చేయనుంది.
- ఆవు పాలు లీటరు (3.5 శాతం ఫ్యాట్, 8.5 శాతం ఎస్ఎన్ఎఫ్)కు హెరిటేజ్ సంస్థ రూ.23.12 ఇస్తుంటే, అమూల్ రూ.28 చెల్లించనుంది. ఇలా ఎక్కువ ధరకు కొనడమే కాకుండా లాభాల్లోనూ అమూల్ రైతులకు బోనస్గా వాటా ఇవ్వనుంది. ఇలా పాడి రైతులకు మేలు చేయడం కోసమే ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.