బసవతారకం ఆస్పత్రిలో కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయి: సీఎం జగన్‌

20 Sep, 2022 15:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైద్యరంగంలో నాడు-నేడుతో భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో వైద్యరంగంలో నాడు-నేడుపై చర్చ జరిగింది. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 'దివంగత నేత వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకాన్ని తెచ్చారు. చంద్రబాబు హయాంలో వైద్యరంగాన్ని అసలు పట్టించుకోలేదు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల బిల్లులను గత ప్రభుత్వం చెల్లించలేదు. మేం వచ్చాక ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ చెల్లించాం. మన తన బేధం లేకుండా.. బాలకృష్ణ నడుపుతున్న బసవతారం ఆస్పత్రికి గతంలో కన్నా ఇప్పుడే టైం టు టైం ఆరోగ్యశ్రీ డబ్బుల్ని ఇస్తున్నాం. చంద్రబాబు హయాంలో కన్నా.. జగన్‌ హయాంలోనే బసవతారకం ఆస్పత్రికి బిల్లలు సకాలంలో వస్తున్నాయన్న మాట అక్కడ కూడా వినిపిస్తోంది.

చదవండి: (దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు: సీఎం జగన్‌)

గత ప్రభుత్వ హయాంలో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూశాం. సెల్‌ఫోన్‌ లైటింగ్‌లో ఆపరేషన్‌లు చేయడం చూశాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి అనేక చర్యలు చేపట్టాం. 5లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. ఇప్పుడు 90శాతం మందికి పైగా ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్నారు. వైద్యరంగంలో నాడు-నేడు కింద రూ.16,255 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం.

ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సలను 3,118కి పెంచాం. ఫ్యామిలీ డాక్టర​ కాన్సెప్ట్‌ తీసుకువస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వైద్యరంగంలో 45వేల ఉద్యోగాలు కల్పించాం. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్‌ కాలేజీల కోసం రూ.12,268 కోట్లు ఖర్చుపెడ్తున్నాం' అని సీఎం జగన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు