AP Assembly Session Updates: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 2022.. అప్‌డేట్స్‌

15 Sep, 2022 20:03 IST|Sakshi

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌

►అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి​ధ్వజమెత్తారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్‌ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. 

► ‘టీడీపీ సొంత అభివృద్ధి కోసమే ఈ ఉద్యమాలు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ కంటే కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పది. అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం కాదు.. కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమే.

►నవరత్నాల ద్వారా రూ.లక్షా 65వేల కోట్లు డీబీటీ ద్వారా లబ్దిదారులకు అందించాం. అవినీతికి తావులేకుండా నేరుగా అకౌంట్లలో వేశాం. చంద్రబాబు హయాంలో రైతుభరోసా ఎందుకు లేదు?. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వలేదు?. 21 లక్షల ఇళ్లు ఎందుకు నిర్మించలేదు?.

►బాబు హయాంలోనూ, ఇప్పుడు ఒకే బడ్జెట్‌ ఉంది.. మరి ఆ నిధులన్నీ ఏమయ్యాయి?.  చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలు ఎందుకివ్వలేదు?. ఆనాడు దోచుకో పంచుకో తినుకో అన్నట్లు సాగింది. 

►బినామీ భూములు ప్రాంతమే రాజధానిగా ఉండాలనేదే పెత్తందారీల మనస్తత్వం. పచ్చళ్లు అమ్మినా మా వారి పచ్చళ్లే అమ్మాలనేది పెత్తందారీ మనస్తత్వం. చిట్‌ఫండ్‌ వ్యాపారమైనా మా వాళ్లే వ్యాపారం చేయాలనేది పెత్తందారీల మనస్తత్వం’ అని సీఎం జగన్‌ విమర్శించారు.

►మా వాడైతే ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించి చిట్‌ఫండ్‌ వ్యాపారం చేయొచ్చనేది వారి మనస్తత్వం. మా నారాయణ, మా చైతన్య ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. ప్రతిపక్ష పార్టీలో కూడా నా మనుషులే ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. వీళ్లంతా ఈ మధ్య ఒకటే రాజధాని అమరావతి అని డిజైన్‌ చేశారు’ అని సీఎం జగన్‌

►ఏపీకి అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ స్వప్రయోజనాల కోసమే రాజధానిగా అమరావతి ఉందన్నారు. విజన్‌ అని చెప్పుకునే చంద్రబాబు ప్లానింగ్‌ ఏంటో అర్థం కాలేదన్నారు. పాదయాత్ర పేరుతో హడావుడీ చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వమే కాకుండా నిర్మాత కూడా చంద్రబాబేనని విమర్శించారు.

►వికేంద్రీకరణపై అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ.. ‘అభివృద్ధి వికేంద్రీకరణ అవమసరమని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. రాజధాని కోసం కేంద్రం శివరామకృష్ణన్‌ కమిటీని నియమిస్తే.. చంద్రబాబు నారాయణ కమిటీని నియమించారు. నారాయణ కమిటీ తుళ్లూరులో రాజధాని ఎంపిక చేసింది. దానికి అమరావతి అని పేరు పెట్టారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ చుట్టూ భూములు కొనిపించినట్టే.. తమ వాళ్లతో అమరావతిలోనూ చంద్రబాబు భూములు కొనిపించారు. రూ. లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి కష్టమనే.. సీఎం జగన్‌ వికేంద్రీకరణకు మొగ్గు చూపారు.’ అని కన్నాబాబు తెలిపారు.

స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్‌ ఆదేశించినా ఆందోళన కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను టీడీపీ సభ్యులు ఏకవచనంతో సంబోధించగా.. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

►పయ్యావుల కేశవ్‌ కుమారుడు భూమలు కొన్నది వాస్తవం కాదా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎప్పుడెప్పుడు భూములు కొన్నారో తమ దగ్గర వివరాలు ఉన్నాయన్నారు. రాజధానిపై ఇష్టానుసారం మాట మార్చింది టీడీపీనే అని విమర్శించారు.

► కొందరి చేతుల్లోనే అమరావతి భూములు ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతిలోనివి తాత్కాలిక నిర్మాణాలు అని తెలిపారు. 30 వేల ఎకరాల భూమిలో కొంతమంది చేతుల్లోనే 10 వేల ఎకరాలు ఉన్నాయని అన్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్‌మెంట్‌ పార్టీ అని, అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 

16 వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన వ్యక్తి సీఎం జగన్‌.  గ్రామ సచివాలయాలతో లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి.  పార్లమెంట్‌ నియోజకవర్గం ఒక జిల్లాగా.. 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్‌ పాలన.మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ. సీఎం జగన్‌పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వాళ్లకు రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశం లేదు. 40 ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దు: కొడాలి నాని

► సచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసిన ఘనత సీఎం జగన్‌దే. గ్రామ సచివాలయాలతో ప్రజలకు పాలన చేరువైంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన మరింత దగ్గరైంది. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకే సచివాలయ వ్యవస్థ. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేశాము. అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన: భూమన కరుణాకర్ రెడ్డి

► వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ

చంద్రబాబు డైరెక్షన్‌లో వీరాంజనేయులు పనిచేస్తున్నారు. అసెంబ్లీలో సభా హక్కులను ఉల్లంఘిస్తున్నారు. దళితులను కించపరచడం టీడీపీకి అలవాటే: సుధాకర్‌బాబు

అసెంబ్లీలో నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు. బాల వీరాంజనేయులు బాధ్యతారహితంగా మాట్లాడారు: మేరుగ నాగార్జున

మా సభ్యులను కావాలనే రెచ్చగొడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.మేరుగ నాగార్జునను రెచ్చగొట్టాలని ప్రయత్నించి నీతులు చెబుతున్నారు. అలాంటి వ్యవహారాన్ని అంగీకరించొద్దు- అంబటి

టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం

►సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టీకరణ

► ఉద్యోగాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. ఇంటికో ఉద్యోగమని చంద్రబాబు మోసం చేశారు. 1.30 లక్షల మందికి సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. 2.80 లక్షల మందికి వాలంటీర్లుగా అవకాశం ఇచ్చాం.  లోకం పూర్తిగా తెలియన వ్యక్తి లోకేష్‌.. దొడ్డిదారిన మంత్రి అయ్యారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టీడీపీ విఫలం: వేణుగోపాలకృష్ణ

తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

► ముగిసిన బీఏసీ సమావేశం.. ఐదురోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. 

► స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ఈ సమావేశంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో పాటు సభ్యులు బుగ్గన, పెద్దిరెడ్డి, జోగి రమేస్‌, ప్రసాద్‌రాజు, శ్రీకాంత్‌రెడ్డిలు పాల్గొన్నారు.  టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు.

దివంగత నేతలకు ఏపీ అసెంబ్లీ సంతాపం
 ఈ మధ్యకాలంలో కన్నుమూసిన నేతలకు.. ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులపర్తి నారాయణమూర్తి, జేఆర్‌ పుష్పరాజ్‌, నల్లమిల్లి మూలారెడ్డి మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు.  
 

సభను అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ఏదో విధంగా గొడవ చేయాలని టీడీపీ సభ్యుల యత్నం.  చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ సభ్యుల ఆందోళన: అంబటి రాంబాబు

నిరుద్యోగ భృతితో మోసం చేసింది చంద్రబాబు. ఎస్సీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. స్టడీ సర్కిళ్లను వైఎస్సార్‌ అభివృద్ధి చేశారు: మేరుగ నాగార్జున 

దళిత వ్యతిరేకి చంద్రబాబు. గత ప్రభుత్వం ఎస్సీలకు చేసేందేమీ లేదు. పేదలకు చంద్రబాబు ఏనాడు మేలు చేయలేదు: జోగారావు


► టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు. టీడీపీ సభ్యులకు చర్చించే దమ్ము లేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారు. త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే : జోగి రమేష్‌

► టీడీపీకి నైతిక హక్కు లేదు. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు ఎలా ఉన్నారో.. వాళ్ల నాయకులు కూడా అలానే ఉన్నారు: సుధాకర్‌బాబు 

2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. సభా సమయం వృథా చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. అసెంబ్లీ పెట్టాలని టీడీపీ నేతలు సవాల్‌ చేశారు. అసెంబ్లీ పెడితే చంద్రబాబు మళ్లీ డుమ్మాకొట్టారు. సభ్యులేమో ఇప్పుడు అడ్డుకోవాలని చూస్తున్నారు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి


టీడీపీ సభ్యుల తీరు సరికాదు: బుగ్గన
► ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే.. ప్రతిపక్ష టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి గోల చేశారు టీడీపీ సభ్యులు. సభను అడ్డుకునేందుకు ఆ పార్టీ సభ్యులు తీవ్రంగా యత్నించారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్‌ తమ్మినేని హామీ ఇచ్చినా.. వాళ్లు ఊరుకోలేదు. ఈ క్రమంలో.. మంత్రి బుగ్గన స్పందించారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదన్నారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. 

► ప్రశ్నోత్తరాలతో మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 

► ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.

► గురువారం నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి, శాసన సభ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అన్ని శాఖల కార్యదర్శులను కోరారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో యావత్‌ ప్రజల దృష్టి ఈ సమావేశాలపై ఉంటుందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలని చెప్పారు. ఇందుకోసం బుధవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కమిటీ హాల్లో పలు శాఖల కార్యదర్శులు, పోలీస్‌ అధికారులతో వారు వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు.

► సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందిస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అటువంటి సత్సంప్రదాయం కొనసాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గత సమావేశాల్లో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలలో కొన్నింటికి ఇంకా సమాధానాలు అందజేయాల్సి ఉందని, వాటిని ఈ సమావేశాల్లో అందజేయాలని చెప్పారు.

► సభ్యులు అడిగిన ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు అందజేసేందుకు ప్రతి శాఖ ఒక లైజనింగ్‌ అధికారిని నియమించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల మెడికల్‌ బిల్లుల చెల్లింపుపై ఆరి్థక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మాజీ ప్రజా ప్రతినిధులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఔషధాలను అందజేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.  

► ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌లు.. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు