పార్టీ బలోపేతంపై సోము వీర్రాజు దిశా నిర్దేశం

22 Sep, 2020 13:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సోము వీర్రాజు  బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం తొలిసారి బీజేపీ రాష్ట్ర పదాధికారుల, జిల్లాల అధ్యక్షులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై సోము వీర్రాజు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘బీజేపీ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఏపీలో పని చేస్తుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు, అభివృద్ధి లక్ష్యంగా మనం పని చేస్తున్నాం. వాజ్‌పేయి ఆధ్వర్యంలో ‘సమృద్ భారత్’ పేరుతో అభివృద్ధి చేశారు. మనం ‘సమృద్ ఆంధ్ర’ పేరుతో ముందుకు సాగుతాం. అనేక రకాల కోణాల్లో ఏపీ అభివృద్ధి చెందాలనేదే బీజేపీ ఆలోచన. సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో దేశంలోనే ఆదర్శంగా ఉండేలా ఏపీని తయారు చేస్తాం. ‘వికసిత వికాస్’ పేరుతో... వికసించే ఆంధ్రాగా తీర్చిదిద్దేలా ఈ పదాధికారుల సమావేశం స్వీకరిస్తుంది అని భావిస్తున్నాను’ అన్నారు సోము వీర్రాజు. (చదవండి: ఎక్కడా లేని అభ్యంతరం.. అక్కడే ఎందుకు?)

‘అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేలా కార్యక్రమాలు ఉండాలి. ఏపీలో 24 గంటలూ విద్యుత్‌ని తీసుకువచ్చాం. కోటి నలభై లక్షల గృహాల్లో కరెంట్ కోత అనేది లేదు. అదే బీజేపీ మంచి పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. నిర్విరామమైన కార్యక్రమాలు, పోరాటాలతో ముందుకు సాగుదాం. పార్లమెంటులో మోదీ తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు రైతులకు వరం. స్వామినాధన్ సిఫార్సులను ఈ బిల్లు ద్వారా అమలు చేయవచ్చు. రైతు తాను పండించిన పంట అమ్ముకునే అవకాశాన్ని మోదీ కల్పించారు. సినిమాల్లో చూసిన రైతు స్వేచ్ఛకు మోదీ నిజంగా చట్ట బద్దత కల్పించి చూపారు. గతంలో కంటే రైతుకు  గిట్టుబాటు ధర కూడా రెట్టింపు వస్తుంది’ అని సోము వీర్రాజు తెలిపారు. 

మరిన్ని వార్తలు