థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు: ఏపీ సర్కార్‌ ముందస్తు ప్రణాళిక

15 Jun, 2021 14:57 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

కోవిడ్ నివారణపై మంత్రి ఆళ్లనాని అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ భేటీ

సాక్షి, అమరావతి: థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది. పీడియాట్రిక్ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నివారణపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్టారెడ్డి, డాక్టర్ సిదిరి అప్పలరాజు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి  ఆళ్ల నాని మాట్లాడుతూ, చిన్నారులకు వైద్యం కోసం అదనంగా వైద్యులు, సిబ్బందిని నియమించాలని, జనావాసాలకు దగ్గరగా హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో చిన్నారులకు వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్‌ను పరిశీలించాలన్నారు.

చిన్నారులకు అవసరమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. థర్డ్‌వేవ్‌లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని, అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే టోకెన్లు పంపిణీ చేయాలని తెలిపారు. బ్లాక్ ఫంగ్ సోకిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. ఇంజక్షన్లు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు.

చదవండి: ‘ఆ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచాడు’
‘ఇమేజ్‌ పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబు’

మరిన్ని వార్తలు