ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ వెల్లడి
‘స్కిల్’ ప్రాజెక్టులో సీమెన్స్ ప్రమేయమే లేదు
ఆ సంస్థ పేరుతో బురిడీ కొట్టించారు
సీఎం హోదాలో బాబు డిజిటల్ సంతకాలే సాక్ష్యం.. అగ్రిమెంట్లో తేదీ, లెటర్ నంబర్ కూడా లేదు
థర్డ్ పార్టీకి ప్రభుత్వ సొమ్ము ఇవ్వొద్దన్న నిబంధనలు బేఖాతరు
నాలుగు లేయర్లలో డబ్బుల పంపిణీ జరిగినట్టు ఆధారాలు.. ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ వెల్లడి
ఈ కుట్ర పుణేలో వెలుగులోకి : ఏపీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి
రూ.కోటి విలువను రూ.250 కోట్లకు పెంచారు.. ఈ స్కామ్ ఫైళ్లను సెక్రటేరియట్లో తగులబెట్టారు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచుకున్నారని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డిలు తెలిపారు. ఈ అడ్డగోలు అవినీతికి పూర్తి ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఈ స్కామ్ తాలూకు ఫైళ్లపై 13 డిజిటల్ సంతకాలు చేశారని వెల్లడించారు.
ఆ సంతకాల కాపీలను మీడియా ఎదుట ప్రదర్శించారు. అగ్రిమెంట్లలో కనీసం తేదీ వేయకపోవడం, లెటర్ నంబర్ ప్రాంతాల్లో ఖాళీలను వదిలిన విషయాన్ని బయటపెట్టారు. థర్డ్ పార్టీకి డబ్బులు ఇవ్వకూడదన్న నిబంధనలు పాటించలేదన్నారు. అన్ని వివరాలను పవర్పాయింట్ ప్రెజెంటేషన్తో వివరించారు. ఈ కుంభకోణానికి తెరతీసేందుకు రూపొందించిన అగ్రిమెంట్లో లోపాలు మొదలు.. నిధుల మళ్లింపు, షెల్ కంపెనీల్లోకి వాటిని తరలించిన విధానం.. తద్వారా ఎలా లబ్ధిపొందారన్న పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.
సీమెన్స్ కంపెనీకి ప్రాజెక్టు గురించే తెలీదు
తమ ప్రమేయమే లేదని ‘సీమెన్స్’ చెప్పింది
సాఫ్ట్వేర్ కోసం డిజైన్టెక్ నుంచి రూ.58.80 కోట్లు
‘దశా’ంశాల ఆధారంగా దర్యాప్తు
నోట్ ఫైళ్లు మాయం చేశారు
ఈ కుంభకోణం బయట పడకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్కు సంబంధించిన నోట్ ఫైళ్లను ఉద్దేశ పూర్వకంగా గల్లంతు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు గురించి జీవో 4, సీమెన్స్తో ఒప్పందం గురించి జీవో 5 జారీ చేశారు. కానీ ఆ రెండు జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ జీవో 8 ద్వారా అంతకు ముందు ఇచ్చిన జీవోలు 4, 5 లోని అంశాలను సీఐడీ గుర్తించి వెలికి తీయడంతో ఈ కుంభకోణం బయటపడింది.
వెలుగులోకి విస్తుపోయే నిజాలు
ఈ కుంభకోణం బయట పడకూడదని నోట్ ఫైల్స్ను సెక్రెటేరియట్లో తగలబెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఎంతో స్కిల్ఫుల్గా టీడీపీ ప్రభుత్వ హయాంలో దోచేశారు. జర్మనీకి చెందిన సీమెన్స్ ఏజీ అనే కంపెనీ ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.3300 కోట్ల ప్రాజెక్టులో గ్రాంట్ ఇన్ ఎయిడ్గా అంటే ఉచితంగా ఇస్తామంటూ ముందుకు వచ్చినట్టు ఒప్పందంలో పేర్కొన్నారు.
కేవలం 10 శాతం ఏపీ ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కింద ఇస్తే చాలన్నట్టుగా ఒప్పందాల్లో ఉంది. చివరకు ఈ పది శాతం సొమ్ము రూ.371 కోట్లను నాలుగు లేయర్లుగా సృష్టించి పప్పు బెల్లాలుగా ఏపీ ఖజానా నుంచి కొల్లగొట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధం అని అధికారులు అభ్యంతరం పెట్టినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు స్పష్టమవుతోంది.
రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు సరిగా లేనందున ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా.. తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులు సూచించినా పట్టించుకోలేదు. ఈ విషయాలన్నీ నోట్ఫైల్లో ఉన్నాయి. జీఎస్టీ మినహాయింపుల కోసం డిజైన్టెక్ చేసిన ప్రయత్నంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. పుణేలో జీఎస్టీ అధికారులు వెలుగులోకి తెచ్చారు. ఈ కుంభకోణంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం రూ.కోటి అయ్యే సాఫ్ట్వేర్ను రూ.250 కోట్లుగా చూపారు. ఇది ఎంతో అన్యాయం.
– పొన్నవోలు సుధాకర్రెడ్డి, ఏఏజీ
యోగేష్ గుప్తాతో చంద్రబాబు పీఎస్కు సంబంధాలు
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కొట్టేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి చివరకు నగదు రూపంలో మార్చడంలో షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించినట్టు అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తాలకు ఆర్థిక అంశాల్లో సంబంధాలున్నట్టు గతంలో ఐటీ దాడుల్లో వెల్లడైందన్నారు.
పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేశ్గుప్తాలు కలిసి ఈ మొత్తం వ్యవహారం నడిపారన్నారు. డబ్బులు ఎలా చేర్చారన్న పూర్తి వివరాలు మరింత స్పష్టంగా వెలుగులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ సొమ్మును మళ్లించడం, తిరిగి షెల్ కంపెనీల ద్వారా వాటిని ఒకే వ్యక్తి పొందారనడానికి పూర్తి ఆధారాలున్నాయని చెప్పారు.
ఇందులో హవాలా జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, సీఐడీ దర్యాప్తుతోపాటు సీమెన్స్ గ్లోబల్ కంపెనీ ఇచ్చిన వివరణలు సైతం వెల్లడించాయని తెలిపారు. ఈ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు. సీఐడి దర్యాప్తు కూడా కొనసాగుతోందని, అవసరం మేరకు ఇంకా అరెస్టులు ఉంటాయన్నారు. ఇందులో అనేక కోణాలు దాగి ఉన్నాయని, చార్జిషీట్కు ఇంకా సమయం పడుతుందని వివరించారు.