ఎమ్మెల్యే పార్థసారిథికి పితృ వియోగం.. సీఎం జగన్‌ పరామర్శ

13 Jan, 2023 11:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వైఎస్‌ఆర్‌సీపీ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి పితృవియోగం నేపథ్యంలో.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నగరానికి వచ్చారు. పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ అయిన కొలుసు రెడ్డయ్య యాదవ్‌ ఈ తెల్లవారుఝామున కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రెడ్డయ్య భౌతికకాయానికి నివాళి అర్పించి.. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసేందుకు అక్కడికి వెళ్లారు సీఎం జగన్‌.   

ముందుగా ఎమ్మెల్యే పార్ధసారథి ఇంటికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. కొలుసు రెడ్డయ్య యాదవ్ పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సీఎం వైఎస్ జగన్‌ వెంట మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

మచిలీపట్నం ఎంపీగా పని చేసిన రెడ్డయ్య యాదవ్‌.. ఒకసారి ఉయ్యూరు ఎమ్మెల్యేగానూ నెగ్గారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. స్వగ్రామం మొవ్వ మండలం కారకంపాడులో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు