పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం జగన్‌

6 Jun, 2023 14:53 IST|Sakshi

►పోలవరం నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. పునరావాసం కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. షెడ్యూల్‌ ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించాలని పేర్కొన్నారు.

►12, 658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు తెలిపారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చి దిద్దాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. పోలవరం వద్ద బ్రిడ్జిని నిర్మించాలని పేర్కొన్నారు. 

►దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఇది పూర్తయితే మెయిన్‌ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు. డిసెంబర్‌ కల్లా డయాఫ్రం వాల్‌ పనుల పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

► పోలవరం ప్రాజెక్టులో చిన్న సమస్యలను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారని.. వరద నీటి ప్రవాహం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు.

►ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయా ఫ్రం వాల్‌ దెబ్బతినడంతో ప్రాజెక్టు ఆలస్యంకావడమే కాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు.  ఇది మాత్రం ఎల్లో మీడియాలో కనిపించలేదని ఎందుకంటే.. రామోజీ బంధువులకే నామినేషన్‌ పద్దతిలో పనులు అప్పగించారని సీఎం తెలిపారు.  ప్రాజెక్ట్‌ స్ట్రక్చర్‌లో ఏమాత్రం సంబంధం లేని గైడ్‌వాల్‌.. ఇంత చిన్న సమస్యను పెద్ద విపత్తులా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

► పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం జగన్‌ సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను సమగ్రంగా పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను పరిశీలించారు. ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు పెంపు, ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న దిగువ కాఫర్‌ డ్యాం పనులను కూడా సీఎం దగ్గరుండి పరిశీలించారు. అదే విధంగా గత ప్రభుత్వంలో ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ పరిశీలించారు.

►దిగువ కాఫర్‌ డ్యాం వద్ద పూర్తయిన పనులను సీఎం జగన్‌ పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం గ్యాప్‌-2 వద్ద కోతకు గురైన డయాఫ్రమ్‌ వాల్‌ పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పోలవరం పనులపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష జరుపుతున్నారు.

► పోలవరం పనుల పురోగతిపై అధికారులు ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద  ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్‌ తిలకిస్తున్నారు. వరదల సమయంలో ఎగువ కాఫర్‌ డ్యాం పెంచిన ఎత్తు తీరును, పూర్తైన పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరిస్తున్నారు. కాసేపట్లో పోలవరం పనులపై అధికారులతో సమీక్షించనున్నారు.

► పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతంలో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు.

► సీఎం జగన్‌ కాసేపట్లో పోలవరం ప్రాజెక్ట్‌ వద్దకు చేరుకోనున్నారు. అక్కడ పోలవరం పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

►పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రికార్డు సమయంలో స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసింది. కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు 44 మీటర్లకు పెంచారు. 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తయ్యింది. 

►ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించి.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇందుకోసం సీఎం జగన్‌ మంగళవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్ట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమీక్షా నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

ఫలించిన సీఎం జగన్‌ కృషి.
పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12,911 కోట్లు మంజూరు చేసింది. బిల్లుల చెల్లింపులో విధించిన పరిమితుల తొలగింపునకు అంగీకారం తెలిపింది. 2013-14 ధరలు కాకుండా తాజా ధర మేర నిధులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థికశాఖ లేఖ రాసింది. కేంద్ర ఆర్థికమంత్రి ఆమోదించినట్లు లేఖలో స్పష్టం చేసింది. రూ. 10 వేల కోట్లు అడ్‌హక్‌గా ఇచ్చి ప్రాజెక్ట్‌ పూర్తికి సహాకారం అందించాలని కోరారు. సీఎం జగన్‌ విజ్ఙప్తిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. నిధులు విడుదల చేయాలని జలశక్తి శాఖకు ఆదేశాలిచ్చారు. 
చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే!

మరిన్ని వార్తలు