దయచేసి ఉద్యోగులు సమ్మె విరమించాలి: సీఎస్‌ సమీర్‌ శర్మ

3 Feb, 2022 19:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మ పేర్కొన్నారు. చర్చలు జరపకపోతే సమస్యలెలా తీరుతాయని ప్రశ్నించారు. నిరసనలు, ఆందోళనలతో ఉపయోగం ఉండదని, ఉద్యోగులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కావాల్సింది ఏంటో చెబితే కూర్చొని మాట్లాడతామని తెలిపారు. ఐఆర్‌ అంటే ముందస్తు సర్దుబాటు అని, పీఆర్సీ ఆలస్యం అయితే ఇస్తారని పేర్కొన్నారు. దయచేసి ఉద్యోగులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు.

కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.10 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని, డీఏ మాత్రమే పెంచితే 10 వేల కోట్లు మిగిలేవని సీఎస్‌ తెలిపారు. కొత్త పీఆర్సీ వల్ల ఎవరి జీతాలు తగ్లేదని, ఐఆర్‌తో కొత్త పీఆర్సీని పోల్చి చూడటం సరికాదన్నారు. పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీని పోల్చి చూడాలన్నారు. ఉద్యోగులకు సమస్యలు ఉంటే మంత్రుల కమిటీ ఉందని, ఏదైనా  రిపోర్ట్  తయారు చేసి పరిష్కారం ఆలోచిద్దామని సూచించారు.
చదవండి: సమస్యను మరింత జఠిలం చేసేలా ఉద్యోగుల తీరు: సజ్జల

ఎవ్వరికీ జీతం తగ్గలేదు:  ప్రిన్సిపాల్ సెక్రెటరీ
ఉద్యోగుల జీతం తగ్గిందని ఓ పత్రిక రాసిందని, వాస్తవానికి ఎవ్వరికీ జీతం తగ్గలేదని  ప్రిన్సిపాల్ సెక్రెటరీ శశిభూషన్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ వస్తుంది. దాని వలన 3 శాతం పెరుగుతుంది. ఐఆర్ కలిపినా, కలపకపోయిన జీతం పెరుగుతుంది. ఐఆర్ కేవలం తాత్కాలిక ప్రయోజనం. ఇప్పటి వరకు అన్ని పీఆర్సీల కంటే అత్యధిక ఐఆర్ ఈ ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా అత్యధికంగా 30 నెలలు ఐఆర్‌ ఇచ్చారు.’’ అని  ప్రిన్సిపాల్ సెక్రెటరీ వివరించారు.
చదవండి: ‘ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా.. చంద్రబాబు బిల్డప్‌’

మరిన్ని వార్తలు