దేశంలోనే తొలిసారి.. సాఫ్ట్‌ స్కిల్స్‌లో ఇది కొత్త అధ్యాయం: సీఎం జగన్‌

26 Aug, 2022 13:21 IST|Sakshi

40 కోర్సుల్లో శిక్షణ.. తొలివిడతలో 35,980 మందికి సర్టిఫికెట్లు ప్రదానం

శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగావకాశాల కోసం లింక్డిన్‌ సహకారం

1.15 లక్షల మంది విద్యార్థులకు 13 కంపెనీలతో ఇంటర్న్‌షిప్‌ మ్యాపింగ్‌

ప్రపంచంలో అన్ని సంస్థలూ మన విద్యార్థుల వైపు చూసే రోజు రావాలి: సీఎం జగన్‌

సాక్షి, విశాఖపట్టణం:ప్రపంచంలోనే తొలిసారిగా మైక్రోసాఫ్ట్‌ ద్వారా 1.62 లక్షల మంది ఏపీ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌లో ఉచితంగా శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ చరిత్రలోనే ఇంత మందికి శిక్షణ అందించలేదన్నారు. ఉద్యోగాలను సాధించడంతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకునేలా పాఠ్య ప్రణాళికలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. దేశంలో మొదటిసారిగా నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. శుక్రవారం విశాఖలోని సిరిపురం ఏయూ కాన్వొకేషన్‌ హాల్‌లో మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు. మొదటి విడతలో శిక్షణ పూర్తి చేసుకున్న 35,980 మందికి ధృవపత్రాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

సాఫ్ట్‌స్కిల్స్‌లో కొత్త అధ్యాయం..
మైక్రోసాఫ్ట్‌ ద్వారా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ అందించనుండటం ఇదే మొదటిసారి. మైక్రోసాఫ్ట్‌ చరిత్రలో ఏ దేశంలోనూ ఇంత భారీ స్థాయిలో శిక్షణ ఇవ్వలేదు. ఇప్పటికే శిక్షణ పూర్తైన విద్యార్థులకు, నవంబర్‌లో పూర్తి చేసుకోనున్న విద్యార్థులకు అభినందనలు. సాఫ్ట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఇది సరికొత్త అధ్యాయం. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా నైపుణ్యాలను పెంచేలా పాఠ్య ప్రణాళికను తీర్చిదిద్దాం. సర్టిఫైడ్‌ కోర్సులను అందిస్తున్నాం. డిగ్రీలు పొందినా ఉద్యోగాలు వస్తున్నాయా? లేదా అని ప్రశ్నించుకోవాలి. అందుకే మైక్రోసాఫ్ట్‌ సంస్థతో అడుగులు వేశాం. ప్రపంచంలో అన్ని సంస్థలూ మన విద్యార్థుల వైపు చూసే రోజు రావాలని ఆకాంక్షిస్తున్నాం.


విశాఖలోని సిరిపురం ఏయూ కాన్వొకేషన్‌ హాల్‌లో మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తదితరులు  

40 భిన్న కోర్సుల్లో..
పట్టా పుచ్చుకున్న ప్రతి విద్యార్థీ పూర్తి స్థాయి నిపుణుడిగా మారి ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 40 విభిన్న కోర్సుల్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌ జారీ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్, నెట్‌వర్కింగ్, వెబ్‌ డిజైనింగ్, ఐవోటీ తదితర కోర్సుల్లో శిక్షణ అందించింది.  ఉద్యోగాల సాధనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక విద్యార్థి దాదాపు రూ.30 వేలు ఖర్చు చేస్తే కానీ పొందలేని ఈ శిక్షణ వ్యయాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా అందచేశాం. మైక్రోసాఫ్ట్‌ కూడా చాలా ఉదారంగా ముందుకు వచ్చింది. రూ.465 కోట్ల విలువైన శిక్షణను కేవలం రూ.32 కోట్లకు అందించేందుకు అంగీకరించింది. ఈ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించడంతో పిల్లలు ఉచితంగా శిక్షణ అందుకున్నారు. కేవలం శిక్షణ ఇచ్చి «ధృవపత్రాలు అందించడంతోనే సరిపెట్టుకోలేదు. వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూడా అడుగులు వేశాం. మైక్రోసాఫ్ట్‌  భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద జాబ్‌ పోర్టల్‌ సంస్థ లింక్డిన్‌తో జతకట్టాం. సర్టిఫికెట్స్‌ పొందిన విద్యార్థులకు జాబ్‌లు కూడా సెర్చ్‌ చేసి సలహాలు అందించేలా చర్యలు తీసుకుంటాం.


ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం ఇస్తున్న మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు...
ప్రాథమికవిద్య నుంచి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాం. అమ్మఒడి, మనబడి నాడు–నేడు, విద్యాకానుక, గోరు ముద్ద, సంపూర్ణ పోషణ లాంటి పథకాలు అందిస్తున్నాం. ఉన్నతవిద్యని ప్రోత్సహించేందుకు విద్యాదీవెన, వసతిదీవె న కార్యక్రమాలు చేపట్టాం. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి విదేశీదీవెన అందిస్తున్నాం. చదువుకునేవారికి ఈ ప్రభుత్వం అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అంది స్తోంది. విప్లవాత్మక మార్పులను విద్యారంగంలో తెచ్చాం. పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం.

10 నెలల ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేశాం. బీటెక్‌ ఆనర్స్‌ లాంటి కోర్సులను అందిస్తున్నాం. పరిశ్రమల అవసరాలకు తగ్గ ట్లుగా శిక్షణ అందిస్తున్నాం. డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఇండ స్ట్రియల్‌ ఓరియంటేషన్, డ్యుయల్‌ డిసిప్లినరీ సర్టిఫికేషన్‌ కోర్సులు, స్కిల్‌ కోర్సులు ప్రవేశపెట్టాం. దేశంలో తొలిసారిగా నాలుగేళ్ల ఆనర్స్‌ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్‌ని తెచ్చాం. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ద్వారా మేనేజ్‌మెంట్‌ స్కిల్స్, ప్రోగ్రామింగ్‌ లెర్నింగ్‌ కోసం 2,500 వీడియోలు, 450 ఆడియో పోడ్‌కేస్ట్‌లు ఇందులో పొందుపరిచాం.

13 కంపెనీలతో మ్యాపింగ్‌..
విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానించేలా ఉన్నత విద్యకు సంబంధించి ఒక పోర్టల్‌ని ప్రారంభించాం. ఇందు లో ఇప్పటి వరకూ 1,65,341 మంది విద్యార్థులు రిజిస్టర్‌ అయ్యారు. నాస్కామ్, మార్క్‌బ్రిడ్జి, ఎడ్యుస్కిల్స్‌తో ఒప్పం దాలు చేసుకున్నాం. వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లు చేపడుతు న్నాం. ఇప్పటి వరకూ 1.15 లక్షలమంది విద్యార్థుల్ని 13 కంపెనీలతో ఇంటర్న్‌షిప్‌కు మ్యాపింగ్‌ చేశాం. బాగా చదు వుకుంటేనే పేదరికం నుంచి బయటకు వస్తారనే తాపత్ర యంతో ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఇప్పుడున్న కరిక్యులమ్‌ జాబ్‌ ఓరియంటెడ్‌గా ఉందా లేదా? అనే విషయంపై సీఎం స్థాయి నుంచి కిందిస్థాయి వరకూ మనసు పెట్టి ఆలోచన చే స్తున్నాం. రాష్ట్రంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌రేషియో (జీఈ ఆర్‌) మారాలి. 18 నుంచి 23 సంవత్సరాల్లోపు పిల్లలు ఎంతమంది కాలేజీల్లో అడుగు పెడుతున్నారనేది బ్రిక్స్‌ దేశా లతో పోల్చి చూస్తుంటాం. దురదృష్టమేంటంటే అది మన దేశంలో 26 శాతమే ఉంది. మిగిలినవారు కాలేజీల్లో ఎందు కు చేరడం లేదని పరిశీలన చేస్తే ఆర్థిక భారం కారణంగా కాలేజీల్లో అడుగులు పడటం లేదని తెలిసింది. పిల్లల్ని చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నాం. ఈరోజు మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ ద్వారా దాదాపు 36 వేలమంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగుపడటం శుభపరిణామం. 


సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ పొందిన విద్యార్థినికి సర్టిఫికెట్‌ అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లీష్‌..
ఇంగ్లీష్‌ మీడియం లేకపోతే పోటీ ప్రపంచంలో పిల్లలు నెగ్గుకు రాలేరని ప్రాథమిక విద్య నుంచి కూడా ఇంగ్లీష్‌ మీడియం పెట్టాం. తల్లులను చైతన్యం చేసేందుకు అమ్మ ఒడి తీసుకొచ్చాం. మన బడి.. నాడు–నేడుతో మెరుగైన మౌలిక సదుపాయాల్ని సమకూర్చాం. విద్యా కానుక కింద వారికి కావాల్సినవన్నీ సమకూర్చాం. గోరుముద్ద, సంపూర్ణ పోషణతో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యవరకూ పిల్లల్ని చేయిపట్టి నడిపిస్తూ అడుగులు వేస్తున్నాం. ఇంటర్‌తో ఆగిపోకుండా ప్రతి విద్యార్థీ పై చదువులు చదవాలని ఉద్దేశంతో విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను తెచ్చాం. ప్రతి త్రైమాసికంలో విద్యా దీవెన ఇస్తున్నాం. ఏటా క్రమం తప్పకుండా రెండుసార్లు వసతి దీవెన అందిస్తున్నాం. ఇవన్నీ ఒకవైపు చేస్తూనే పాఠ్యప్రణాళికలో రూపు రేఖలు మారుస్తున్నాం. 

అందరికీ సమాన అవకాశాలు 
నేను బీఎస్‌సీ స్టాటిస్టిక్స్‌ చేశా. చాలామంది నాకు ట్రైనింగ్‌ ఇవ్వరని అన్నారు. కానీ నాకు శిక్షణ ఇచ్చారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు సర్‌. ఆర్థిక స్థోమత కారణంగా విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో నిలిచిపోతారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ దీవెన లాంటి పథకాల ద్వారా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ ఎక్కడా బ్రేక్‌ లేకుండా చదువు కొనసాగించేలా ఆలోచన చేయడం నిజంగా గ్రేట్‌ లీడర్‌కే సాధ్యం.  
 – లిఖిత నెక్కంటి, బీఎస్సీ స్టాటిస్టిక్స్‌ విద్యార్థిని

ముఖ్యమంత్రి తపనతో బృహత్తర కార్యక్రమం 
ప్రపంచవ్యాప్తంగా మన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్‌ ఈ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైక్రోసాఫ్ట్‌ ఎక్కడా ఇంత పెద్ద స్థాయిలో శిక్షణ అందించలేదు. శిక్షణకు అయిన ప్రతి పైసానూ ప్రభుత్వమే భరించింది. గత అక్టోబర్‌లో ట్రైనింగ్‌ ప్రారంభమైంది. పోటీని తట్టుకొని ప్రపంచాన్ని శాసించేస్థాయికి మన విద్యార్థులు ఎదగాలి. 
  – బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి

ప్రపంచంలోనే అతి పెద్ద స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌
రాష్ట్ర ప్రభుత్వంతో వేసిన అడుగులు చరిత్రాత్మకం. ఇంత గొప్ప కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్‌ అధినేత సత్య నాదెళ్ల రాలేకపోయారు. కానీ సందేశం పంపించారు. కెరీర్‌లో అద్భుతమైన దిశగా పయనించేందుకు ఏపీ విద్యార్థులు శిక్షణ తీసుకోవడం చాలా ఉద్వేగంగా ఉంది. డేటా సైన్స్, బిజినెస్, ఇతర కీలక అంశాలకు సంబంధించి శిక్షణ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 35,980 మంది విద్యార్థులు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. లింక్డిన్‌ సపోర్ట్‌తో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం.
    – నవ్‌తేజ్‌ బాల్, మైక్రోసాఫ్ట్‌ ఇండియా హెడ్‌

ఇదీ చదవండి: పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే ఆర్థిక పురోగతి.. సీఎం జగన్‌

మరిన్ని వార్తలు