దిశ యాప్‌ నొక్కగానే వెంటనే స్పందించాలి: సీఎం వైఎస్‌ జగన్‌

21 Mar, 2022 22:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: దిశ యాప్, చట్టం అమలుపై సీఎం వైఎస్‌ జగన్‌ నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. ఏపీలో ప్రతి మహిళా క్షేమం, సంక్షేమం అనే నినాదంతో ముందుకెళ్ళాలని సూచించారు. నేర నిరోధం కోసం సమస్యాత్మక ప్రాంతాలలో అతి త్వరలో 163 దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ ప్రారంభించనున్నట్లుగా సీఎం జగన్ ప్రకటించారు. వీటితో పాటు 18 దిశ మొబైల్‌ రెస్ట్‌రూమ్స్‌ అందుబాటులోకి రానున్నట్లుగా వెల్లడించారు.

ప్రతి మహిళా దిశ యాప్‌ వినియోగించాలి అని సూచించారు. దిశ యాప్‌ నొక్కగానే పోలీసులు వెంటనే స్పందించాలని, అతి తక్కువ సమయంలో ఘటన స్థలానికి చేరుకుని ఆపన్నహస్తం అందించాలని ఆదేశించారు. దిశ పీఎస్‌కు వచ్చే ప్రతీ కేస్‌ కూడా శిక్ష పడేవరకూ రెగ్యులర్‌గా మానిటర్‌ చేయాలి, ఎప్పటికప్పుడు బాధితులతో మాట్లాడి వారికి స్వాంతన కలిగించాలి అన్నారు. కన్విక్షన్‌ పెరిగే దిశగా త్వరితగతిన ఎవిడెన్స్‌ సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటివరకూ 92.7 శాతం కేసులు చార్జిషీట్లు వేసినట్లు సీఎంకి అధికారులు వివరించారు. దిశ పై సోషల్‌ మీడియా ద్వారా కెపాసిటీ బిల్డింగ్‌ చేయడంతో పాటు, పనితీరు మెరుగుపరిచేలా రోజువారీ సమీక్షలు నిర్వహించాలన్నారు.

గ్రామ వలంటీర్, మహిళా పోలీస్‌ను భాగస్వామ్యం చేయాలి, ప్రతీ 15 రోజులకోసారి దిశపై హైపవర్‌ కమిటీ రివ్యూ చేయాలన్నారు. దిశ యాప్‌ ద్వారా వచ్చే కాల్స్, కేసుల్లో ఎట్టి పరిస్ధితుల్లో అలసత్వం ప్రదర్శించకూడదని అన్నారు. ఒకవేళ అలా జరిగితే కఠిన చర్యలు తప్పవని సీఎం జగన్ హెచ్చరించారు. ఇప్పటి వరకూ 1.16 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేశారని అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ కే.రాజేంద్రనాథ్‌ రెడ్డి, డీఐజీ టెక్నికల్‌ సర్వీసెస్‌ పాలరాజు, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు