అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు

11 Dec, 2020 05:12 IST|Sakshi
జగనన్న జీవక్రాంతి పథకం లబ్ధిదారులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, అధికారులు

వారి ముఖాల్లో సంతోషం ఉండేలా ప్రభుత్వం కృషి

జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటాను

2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం.. అక్క చెల్లెమ్మల కోసం ఏడాదిన్నరగా అనేక పథకాలు

వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి

రాష్ట్రంలో మ్యాంగో ప్రాసెసింగ్‌ యూనిట్‌.. అల్లానా ఆసక్తిని స్వాగతించిన సీఎం  

సాక్షి, అమరావతి: వ్యవసాయం, పాడి పశువుల రంగంలో ఉన్న రైతులు, అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుందని.. అక్క చెల్లెమ్మలు, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. అందుకే వారి ముఖాల్లో అహర్నిశలు సంతోషం ఉండేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల్లో భాగంగా అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో మేకలు, గొర్రెల యూనిట్లు పంపిణీ చేసే ‘జగనన్న జీవ క్రాంతి’ పథకాన్ని గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి పర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం జగన్‌కు గొంగడి కప్పి, తాటి ఆకులతో రూపొందించిన గొడుగు, మేక పిల్లను బహూకరించారు. అనంతరం జిల్లాల్లోని లబ్ధిదారులనుద్ధేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,869 కోట్ల వ్యయంతో మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు మూడు దశల్లో పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పథకం అత్యంత తృప్తి ఇచ్చే పథకాల్లో ఒకటి అని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

చేయి పట్టుకుని నడిపిస్తున్నాం..
► గ్రామీణ ప్రాంతాల్లో చేయూత, ఆసరా కింద ఇచ్చిన డబ్బులతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలు వ్యాపారం చేసుకునేలా సహకారం అందిస్తున్నాం. దాని వల్ల అదే గ్రామంలో వారికి ఉపాధి కల్పించడంతో పాటు, ఆదాయ వనరు ఏర్పరచినట్లు అవుతుంది. తద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలు మారుతాయి.
► చేయూత పథకంలో ఏటా రూ.18,750 చొప్పున 4 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వడంతో పాటు, కుటుంబ సభ్యుడిగా వారిని చేయి పట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నాం. చిత్తశుద్ధితో పథకాలు చేపడితే ఎలా ఉంటాయన్న దానికి ఇదే ఉదాహరణ.  

ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు
► అమూల్‌తో ఒప్పందం తర్వాత రూ.3,500 కోట్లతో 4.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు.. అంటే ఒక ఆవు, దూడ.. లేదా కడుపుతో ఉన్న గేదె పంపిణీకి శ్రీకారం చుట్టాం. ఇవాళ రూ.1,869 కోట్లతో 2.49 లక్షల యూనిట్ల మేకలు, గొర్రెలు పంపిణీకి శ్రీకారం చుట్టాం. ఒక్కో యూనిట్‌లో ఐదారు నెలల వయసున్న 14 మేకలు లేదా గొర్రెలు.. ఒక మేకపోతు లేదా పొట్టేలు ఉంటుంది. మొత్తంగా రూ.5,500 కోట్ల వ్యయంతో అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం.
► 2,11,780 ఆవుల యూనిట్లు, 2,57,211 గేదెల యూనిట్ల పంపిణీని వారం క్రితం ప్రారంభించాం. ఈ పథకం ప్రారంభం రోజున 7 వేల యూనిట్లు పంపిణీ చేశాం. వచ్చే ఫిబ్రవరి నాటికి లక్ష యూనిట్లు, ఆ తర్వాత ఆగస్టు నుంచి మళ్లీ ఫిబ్రవరి (2022) వరకు 3.69 లక్షల యూనిట్లు పంపిణీ చేస్తాం. ఆ విధంగా దాదాపు 4.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెల పంపిణీ జరుగుతుంది.
► 1,51,671 గొర్రెల యూనిట్లు, 97,480 మేకల యూనిట్ల పంపిణీకి షెడ్యూల్‌ ఇచ్చాం. తొలి దశలో వచ్చే మార్చి చివరి నాటికి 20 వేల యూనిట్లు, రెండో విడతలో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 1.30 లక్షల యూనిట్లు, మూడో విడతలో సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 99 వేల యూనిట్లు పంపిణీ చేస్తాం. ఇందుకోసం దాదాపు 40 లక్షల మేకలు, గొర్రెలను ఎక్కడెక్కడి నుంచో సేకరించాల్సి వస్తోంది. అందుకే మూడు దశల్లో కార్యక్రమం చేపట్టాం.

పలు సంస్థలతో ఒప్పందం
► చేయూత సొమ్ముతో అక్క చెల్లెమ్మలకు ఈ విధంగా జీవనోపాధి కల్పించి, వారికి లాభాలు వచ్చేలా చూసేందుకు ఐటీసీ, అమూల్, రిలయెన్స్, పీ అండ్‌ జీ, హెచ్‌ఎల్‌ఎల్, అల్లానా వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం.   
► స్థానిక జాతుల్లో నచ్చిన మేకలు, గొర్రెలను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. సరైన ధరకు వచ్చేలా, అన్నీ సవ్యంగా జరగడం కోసం ప్రత్యేకంగా ఇద్దరు పశు వైద్యులు, సెర్ప్‌ అధికారులు, బ్యాంక్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ లబ్ధిదారుడికి అడుగడుగునా తోడుగా నిలుస్తుంది.
► రాష్ట్రంలో మాంసం కొనడానికి అల్లానా గ్రూప్‌ ఉంది. ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే అంత కంటే ఎక్కువ ధర వస్తే అక్కచెల్లెమ్మలు నేరుగా అమ్ముకోవచ్చు. అల్లానా గ్రూప్‌ తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలలో మీట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది.  

ఆర్బీకేల ద్వారా మరిన్ని సేవలు
► గ్రామాలలో ఆర్బీకేలు రైతులకు వ్యవసాయ పరంగానే కాకుండా, పశు పోషణలో కూడా తోడ్పడతాయి. రైతులు, అక్క చెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తాయి. పశువుల మంచి చెడులు చూసే వ్యవస్థ కూడా ఆర్బీకేలలో ఉంటుంది.
► నత్తల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు, బాహ్య పరాన్న జీవుల నిర్మూలన, పశు ఆరోగ్య సంరక్షణ కార్డుల జారీ, సమతుల్యమైన దాణా సరఫరా వంటివి ఆర్బీకేల పరిధిలో ఉంటాయి. వైఎస్సార్‌ సన్నజీవుల నష్ట పరిహారం పథకాన్ని (ఇన్సూ్యరెన్స్‌), టీకాలు వేయడం, వెటర్నరీ సర్వీసులను కూడా ఆర్బీకేల పరిధిలోకి తెస్తాం.
► పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నాటు కోళ్ల పెంపక కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తే బాగుంటుందని ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి సూచించారు. ఈ ప్రతిపాదనను కూడా పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మరింత తోడుగా నిలుస్తాం
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు మరింత తోడుగా నిలుస్తాం. రాష్ట్రంలో మీట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో పాటు, మ్యాంగో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు కూడా (సీఎం స్వాగతించారు) ఇదే సరైన సమయం. బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో మేకలు, గొర్రెలలో మంచి బ్రీడ్‌ ఉంది. వాటిని ఇక్కడికి కూడా తీసుకువస్తే.. రైతులు, అక్క చెల్లెమ్మలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇందుకు మేము సహకరిస్తాం. (ఈ విషయాన్ని వెంటనే పరిశీలించాలని పశు సంవర్థక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు)

– వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇర్ఫాన్‌ అల్లానా, అల్లానా గ్రూప్‌ చైర్మన్‌

అక్క చెల్లెమ్మలు చేపట్టబోయే ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లాలి. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు తీసుకు వచ్చేందుకు ఏడాదిన్నరగా ఎన్నో పథకాలు అమలు చేశాం. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం ఇస్తూ చట్టం చేశాం. మరోవైపు దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు కూడా అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వబోతున్నాం. ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం. వీరికి ఇంకా మేలు చేసే అవకాశం దేవుడు కల్పించాలి.

గత ప్రభుత్వాలు ఏనాడూ వ్యవసాయ అనుబంధ రంగాలను బాగు చేయాలని భావించలేదు. వ్యవసాయంతో పాటు మేకలు, పశువులు, కోళ్లు, చేపల సాగు వంటివి చేపడితే రైతుల కుటుంబాలకు ఎంతో అండగా ఉంటుంది. కరవు కాటకాలు వచ్చినా అవి ఆదుకుంటాయి. రైతన్నలు, అక్క చెల్లెమ్మలకు అదనంగా ఆదాయం కల్పించే వనరులివి.

నాన్న గారిని మించి మేలు చేస్తున్నారు
నాకు 47 ఏళ్లు. వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.18,750 తీసుకున్నాను. బ్యాంకు ద్వారా రూ.56,250 రుణం వచ్చింది. ఇద్దరు డాక్టర్లు, ఏపీఎం, బ్యాంకు ఆఫీసర్‌ వచ్చి మొత్తం రూ.75 వేలతో జీవాలు కొనిచ్చారు. చాలా ఆనందంగా ఉంది. రైతు భరోసా కేంద్రం ద్వారా టీకాలు, మందులు ఉచితంగా ఇస్తారు. మహిళలందరం పలు పథకాల వల్ల లబ్ధిపొందుతున్నాం. నాన్న గారి కంటే మించి మీరు మేలు చేస్తున్నారు. మా మహిళల దీవెనలన్నీ మీకే ఉంటాయి.

– మరియమ్మ, రుద్రవరం గ్రామం, బేతంచర్ల మండలం, కర్నూలు జిల్లా.

జీవనాధారం దొరికింది
వైఎస్సార్‌ చేయూత సొమ్ము, లోన్‌ ద్వారా 14 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలు ఇచ్చారు. మేం నష్టపోకుండా ఎలా సాకాలన్న దానిపై మాకు ట్రైనింగ్‌ ఇచ్చారు. మాకు జీవనాధారం దొరికింది. గతంలో రుణాల కోసం పనులు మానుకుని, తిండి లేకుండా పడిగాపులు కాసేవాళ్లం. ఇప్పుడు మీరు పెట్టిన గ్రామ సచివాలయాల వల్ల, వలంటీర్ల వల్ల మా పనులు సులభంగా అవుతున్నాయి. రైతు భరోసా, పింఛన్లు, అమ్మ ఒడి, విద్యా కానుక.. ఇలా ఎన్నో పథకాల వల్ల అందరికీ మేలు జరుగుతోంది. కరోనా కష్టకాలంలో మీ వల్ల మూడు పూటలా అన్నం తిన్నాం. చాలా సంతోషంగా ఉంది.  

– దానమ్మ, ఎరుమల్లపాడు, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లా.   

మా కాలంలో నువ్వే రాముడివి  
14 గొర్రెలు, ఒక పొట్టేలు డాక్టర్లు సూచించినవే తీసుకున్నాను. వాటిని బాగా మేపుకుంటే మంచిగా కుటుంబాన్ని పోషించుకోవచ్చు. ఎక్కడా పనికి పోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆదాయం పెరుగుతుంది. పిల్లలను ధైర్యంగా చదివించుకోవచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా పాపకు అమ్మఒడి వచ్చింది. నాకు వితంతు పింఛన్‌ వస్తోంది. మా సంఘానికి రుణమాఫీ కూడా వచ్చింది. ‘ఇప్పుడు మా దేవుడు ఇంటికాడ కొచ్చి పింఛన్‌ ఇత్తాండు’ అని మా నాన్న పొగుడుతున్నాడు. అన్నా.. రాఖీ పండుగ రోజు నీ ఫొటో గూట్లో పెట్టి రాఖీ కట్టాను. రామ రాజ్యం గొప్పదని పెద్దలు అంటారు.. అదెలాంటిదో మేం చూడలేదన్నా.. మా కాలంలో నువ్వే రాముడివి. దేవుడివి.   
   
    – లక్ష్మీదేవి, నాయనపల్లి, అనంతపురం జిల్లా

మీ మేలు మరవలేం
పాదయాత్రలో మీరు ప్రకటించిన విధంగా మాకు అన్ని విధాలా మేలు చేస్తున్నారు. జగనన్న జీవ క్రాంతిలో భాగంగా మేకలను పొందడానికి సిద్ధంగా ఉన్నాం. వాటి ద్వారా బాగా అభివృద్ధి చెందుతామనే నమ్మకం ఉంది. నా ముగ్గురు పిల్లలకు విద్యా దీవెన అందింది. మా అత్తకు పింఛన్‌ వస్తోంది. ఇంటింటికీ తలుపు తట్టి పింఛన్‌ ఇస్తున్నారు. కరోనా సమయంలో బాగా ఆదుకున్నారు. మీ మేలు మరవలేము.  

–  సవర ఇవాంజెలిన్, సిరిపురం గ్రామం, పలాస, శ్రీకాకుళం జిల్లా. 


జగనన్న జీవక్రాంతి పథకం లబ్ధిదారులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, అధికారులు

రైతుల మాదిరిగా పశువులకు కూడా పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తాం. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కొన్న వారికి ఇది ఉపయోగ పడుతుంది. కర్నూలు జిల్లా డోన్, అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. ఆధునిక పోషణ, యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు జారీ చేస్తాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు