సహకార రంగంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

3 Mar, 2021 18:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సహకార రంగంపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరుపై సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరాలు అందజేశారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని అధికారులు నివేదించారు. వాటి లైసెన్స్‌లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. 45 శాతం పీఏసీఎస్‌లు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయని వెల్లడించారు. 49 శాతం మండలాలకు డీసీసీబీ బ్రాంచ్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం లేదని, తక్కువగా రుణాలు ఇవ్వడంతోపాటు మోసాలు అధికంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం పంటరుణాలకే పరిమితం అవుతున్నాయని తెలిపిన అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవడం లేదని వివరించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ, సహకారశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సహకారశాఖ స్పెషల్‌ సెక్రటరీ వై మధుసూదనరెడ్డి, కమిషనర్‌ అండ్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోపరేటివ్‌ సోసైటీస్‌ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

సహకార వ్యవస్ధ బలోపేతం–సిఫార్సులు
సహకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్ధవంతగా నడపడానికి యాజమాన్య పద్ధతుల్లో ఎన్‌ఏబిసీఓఎన్‌ఎస్‌ (నాబార్డ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌-నాబ్కాన్స్‌) సిఫార్సులపై సమావేశంలో చర్చించారు. సమగ్రమైన బ్యాంకు సేవలు కోసం ఆప్కాబ్, డీసీసీబీల నుంచి పీఏసీఎస్‌ల వరకు కంప్యూటరీకరణ చేయాలని సీఎం జగన్‌ సూచించారు. పీఏసీఎస్‌లు క్రెడిట్‌ సేవలతో పాటు నాన్‌ క్రెడిట్‌ సేవలు కూడా అందించాలని,  పీఏసీఎస్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతీ 3 ఆర్బీకేలకు ఒక పీఏసీఎస్‌ ఉండేలా చూడాలని ప్రతిపాదించారు. ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో నిపుణులైన వారిని నియమించాలని అన్నారు. వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, అకౌంటెన్సీల్లో నిపుణులైన వారిని బోర్డుల్లోకి తీసుకురావాలని సిఫార్సు చేశారు. బోర్డుల్లో మూడింట ఒక వంతు మందిని డైరెక్టర్లుగా నియమించాలని, బోర్డులో సగం మంది ప్రతి రెండున్నర సంవత్సరాలకు విరమించేలా ఏపీసీఎస్‌ యాక్ట్‌కు సవరణ తీసుకురావాలని పేర్కొన్నారు. అలాగే పీఏసీఎస్‌ల్లో కూడా మూడింట ఒక వంతు మంది ప్రొఫెషనల్స్‌ను తీసుకురావాలని, గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ అసిస్టెంట్లను పీఏసీఎస్‌ సభ్యులుగా తీసుకురావాలని తెలిపారు. ఈ మేరకు చట్ట సవరణకు సీఎం అంగీకారం తెలిపారు. పీఏసీఎస్‌ల్లో క్రమం తప్పకుండా నిపుణులైన వారితో ఆడిటింగ్‌కు నిర్ణయం తీసుకోగా రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే ఏంచేయాలన్న దానిపైన కూడా కార్యాచరణ ఉండాలని సీఎం అన్నారు. థర్డ్‌పార్టీతో స్వతంత్రంగా విచారణ చేయించాలని ఆదేవఙంచారు.

(చదవండి: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు)

డీసీసీబీల్లో మెరుగైన పనితీరు
► డీసీసీబీల నుంచి చక్కగా రుణాలు అందాలని సీఎం జగన్‌ అన్నారు. ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే...
►రుణాలు ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నదానిపై నిర్దిష్ట విధివిధానాలు ఉండాలి.
►ఈ విధివిధానాలకు లోబడే అందరి పనితీరు  ఉండాలని స్పష్టీకరణ
►వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలకు డీసీసీబీలు దన్నుగా నిలిచేలా పలు సిఫార్సులు
►కోఆపరేటివ్‌ బ్యాంకుల మార్కెట్‌షేర్‌ 20 శాతం వరకు పెంచాలని నిర్ణయం
►ఆర్బీకేల కార్యక్రమాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా డీసీసీబీల రుణ ప్రణాళికలు
►అలాగే ఫుడ్‌ ప్రాససింగ్‌ చేసే ఎంఎస్‌ఎంఈలకు దన్నుగా ఉండేలా రుణ కార్యక్రమాలు
►డీసీసీబీ బ్యాంకుల పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూల స్వభావం పోవాలి
►విశ్వాసం, నమ్మకం కలిగించాలి

(చదవండి: మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే హవా)

నాణ్యమైన సేవలు అందాలి
►సహకార సంఘం ఆర్థిక కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు
►డీసీసీబీ బ్యాంకుల సమర్థత పెరగాలి, మంచి యాజమాన్య పద్దతులు రావాలి
►పీఏసీఎస్‌లలో నిర్దిష్ట సమయంలోగా కంప్యూటరీకరణ
►రుణాలు ఇవ్వడంలో మంచి ప్రమాణాలు పాటించాలి
►మూడు నెలల్లో కంప్యూటరీకరణకు ప్రణాళిక
►వచ్చే ఏడాది మార్చి లోగా స్థిరీకరణ
►చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్‌ ఉత్పత్తిపై దృష్టి సారించాలి
►దీనివల్ల చక్కెర కర్మాగారాలకు ఊరట లభిస్తుంది

(చదవండి: ఏపీ అన్ని విధాలా అనుకూలం)

మల్టీపర్పస్‌ సెంటర్లపై సీఎం సమీక్ష..
వ్యవసాయం అనుబంధరంగాల్లో విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం చేపడుతున్న మల్టీపర్పస్‌ సెంటర్ల నిర్మాణంపైనా సీఎం సమీక్ష నిర్వహించారు.

► గోడౌన్ల నిర్మాణానికి ఏప్రిల్‌ 15 కల్లా టెండర్ల ఖరారు.
► ఏడాది కాలంలో నిర్మాణాల పూర్తికి కార్యాచరణ ప్రణాళిక
► ప్రతి ఆర్బీకే పరిధిలోనూ మల్టీపర్సస్‌ సెంటర్లు
► మల్టీపర్సస్‌ సెంటర్లలో రానున్న గోడౌన్లు, డ్రైయింగ్‌యార్డులు, కోల్డు రూమ్‌లు, పంటల సేకరణకేంద్రాలు ఇతర వ్యవసాయ పరికరాలు, సామగ్రి
► మొత్తం వీటన్నింటి కోసం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

పాలవెల్లువ కార్యక్రమంపైనా సీఎం సమీక్ష
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల రైతులకు మంచి రేటు దొరుకుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. మిగతా జిల్లాలకూ ప్రాజెక్టును విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.

► వైఎస్సార్‌ జిల్లాలో గతంలో లీటరు గేదెపాలు రూ. 44.31, ఇప్పుడు 53.95
► రైతుకు అదనంగా రూ. 9.64 లబ్ధి
► అదే లీటరు ఆవుపాలకు గతంలో వచ్చే రేటు రూ.25, ప్రస్తుతం 32.80
► రైతుకు అదనంగా లబ్ధి రూ.7.80

► చిత్తూరు జిల్లాలో గతంలో లీటరు గేదెపాలు రూ. 43.25, ప్రస్తుతం రూ. 52
► రైతుకు అదనంగా రూ. 8.75
► అదే లీటరు ఆవుపాలకు గతంలో వచ్చే రేటు రూ.26, ప్రస్తుతం 34.13
► రైతుకు అదనంగా లబ్ధి రూ.8.13

► ప్రకాశం జిల్లాలో గతంలో రూ.45, ప్రస్తుతం రూ. 59.15
► రైతుకు అదనంగా రూ.14.15
► అదే లీటరు ఆవుపాలకు గతంలో వచ్చే రేటు రూ.24, ప్రస్తుతం 32.78
► రైతుకు అదనంగా లబ్ధి రూ.8.78

మరిన్ని వార్తలు