ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్‌

8 Sep, 2021 15:38 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వైద్య, ఆరోగ్య శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై అధికారులు సీఎం జగన్‌కు వివరాలందించారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 14,452 ఉండగా.. రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని తెలిపారు. 10,494 సచివాలయాల్లో యాక్టివ్‌ కేసులు నమోదు శాతం జీరో అని అధికారులు తెలిపారు. 

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 3,560 మంది కాగా.. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 926 మంది.. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారు 9,966 మంది ఉన్నారని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్‌ 92.50 శాతం ఉండగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 70.69 శాతం ఉన్నాయన్నారు. 104 కాల్‌ సెంటర్‌కు 684 ఇన్‌కమింగ్‌ కాల్స్‌ మాత్రమే వచ్చాయని తెలిపారు. 18 దఫాలుగా ఇప్పటివరకు ఫీవర్‌ సర్వే పూర్తి చేశామని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు.

థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతపై ప్రణాళిక సిద్ధం
కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 20,964 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ అందుబాటులో ఉన్నాయని.. ఇంకా రావాల్సినవి 2493 ఉన్నాయన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ డి–టైప్‌ సిలిండర్లు 27,311 కాగా.. ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ పనులు పూర్తైన ఆస్పత్రులు 108 అని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. 

ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు  
50 అంతకంటే ఎక్కువ బెడ్స్‌ ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశామని అధికారులు సీఎం జగన్‌కి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 140 ఆస్పత్రులలో పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు చేశామని.. అక్టోబరు 6 నాటికి ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటు పూర్తవుతుందని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు.

వ్యాక్సినేషన్‌
రాష్ట్రంలో ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ చేయించుకున్నవారు 2,23,34,971 మంది ఉండగా.. వీరిలో సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు 1,31,62,815 మంది కాగా.. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు 91,72,156 మంది అని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. ఇటీవల కేరళలో పర్యటించిన అధికారులు, వైద్యాధికారుల బృందం కోవిడ్‌తో పాటు ఇతర క్షేత్రస్థాయి పరిశీలనాంశాలను సీఎం జగన్‌కు వివరించారు. 

శిశు మరణాలు తగ్గించాలి..
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘శిశు మరణాలను తగ్గించాలి. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.  ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. చక్కటి విధివిధానాలను ఖరారు చేయాలి. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీల్లో పీజీ కోర్సులు కూడా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. పారామెడికల్‌ సిబ్బందికీ మెడికల్‌ కాలేజీల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. పబ్లిక్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌పై కోర్సులు దృష్టి పెట్టాలని’’ అధికారులను ఆదేశించారు. 

హెల్త్‌డేటాపై అన్నిరకాల చర్యలు తీసుకోవాలి..
‘‘ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి. రక్తం, నీరు, గాలి ఈ మూడింటిపైన పరీక్షలు జరగాలి. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలో ఈ పరీక్షలు అందుబాటులో ఉండాలి. అవసరమైన చోట సీహెచ్‌సీల్లో కూడా డయాలసిస్‌ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలి. హెల్త్‌డేటాపై అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. ఎక్కడ పరీక్షలు చేయించుకున్నా, ఎక్కడ చికిత్స తీసుకున్నా గుర్తింపు కార్డు ద్వారా ఆ వివరాలతో కూడిన డేటా అప్‌లోడ్‌ చేయాలి. ఒక వ్యక్తి వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఆ వివరాలు డాక్టర్‌కు వెంటనే అందుబాటులోకి వచ్చే విధానం ఉండాలి. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినా, విలేజ్‌ క్లినిక్‌ నుంచి టీచింగ్‌ ఆస్పత్రి వరకూ ఎక్కడికి వెళ్లినా... అక్కడ చేయించుకున్న పరీక్షల వివరాలు, చికిత్స వివరాల డేటా అప్‌లోడ్‌ కావాలి. దీనికి సంబంధించి మంచి సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్‌ సూచించారు. 

థర్డ్‌వేవ్‌ సమాచారం నేపథ్యంలో కోవిడ్‌ నియంత్రణకు నూతన చికిత్సా విధానాలపై దృష్టి సారించాలన్న సీఎం.. కొత్త మందులు, మెరుగైన ఫలితాలు, తక్కువ దుష్ప్రభావాలు ఉన్నవాటి వినియోగంపై దృష్టిపెట్టి అన్నిరకాలుగా సిద్ధం కావాలని తెలిపారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్‌ పర్సన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ బాబు,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జే వి యన్‌ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి:
 ఇకపై ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు
అయ్యో! వారి బతుకులు కరిగిపోతున్నాయ్‌

మరిన్ని వార్తలు