నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం చర్యలు తీసుకోండి: సీఎం జగన్‌

1 Oct, 2021 16:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులు పోలవరం ప్రాజెక్ట్‌ పనుల ప్రగతిని సీఎం జగన్‌కు వివరించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన దిగువ కాపర్‌ డ్యాం పనులు, కెనాల్స్‌కు కనెక్టివిటీ అంశాలపై సమీక్షలో చర్చించారు. గ్యాప్‌ 3 కాంక్రీట్‌ డ్యామ్‌ పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి కాల్వల ద్వారా నీరందించేందకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఈసీఆర్‌ఎఫ్‌ పనుల ప్రారంభానికి ప్రణాళిక సిద్ధం చేశామని అధికారలు సీఎం జగన్‌కు వివరించారు. 

ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులపై కూడా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 2,033 కోట్ల రూపాయలకు పైగా నిధులు రావాల్సి ఉందని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర నిధులు త్వరగా వచ్చేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 
(చదవండి: Badvel By Election: ఓటింగ్‌ శాతం పెరగాలి: సీఎం జగన్‌)

ఇతర ప్రాజెక్ట్‌లపై సీఎం జగన్‌ సమీక్ష
రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్ట్‌ల ప్రగతిపై కూడా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి చేశామని.. నవంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమని అధికారులు వెల్లడించారు. అవుకు టన్నెల్‌ నిర్మాణంలో గణనీయ ప్రగతి సాధించామని.. వచ్చే ఆగస్టు నాటికి టన్నెల్‌ పూర్తి చేసి నీటిని ఇస్తామని అధికారులు తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులపై సీఎం జగన్‌ సమీక్ష
వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రెండో టన్నెల్‌ పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వంశధార స్టేజ్‌-2 పనులు వచ్చే మే నాటికి పూర్తి చేస్తామని తెలిపారు అధికారులు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఒడిశా రాష్ట్రంతో చర్చల కోసం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. తోటపల్లి బ్యారేజీ కింద వచ్చే ఖరీఫ్‌ నాటికి నీటిని అందిస్తామని అధికారులు తెలిపారు. 
(చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: 6 నెలలు ఎక్కడ ఉంటే అక్కడే పింఛన్‌)

మహేంద్రతనయ ప్రాజెక్ట్‌ నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిందిగా సీఎం జగన్‌ ఆదేశించారు. కొల్లేరు వద్ద గోదావరి, కృష్ణా డెల్టాల్లో రెగ్యులేటర్‌ నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. తాండవ ప్రాజెక్ట్‌ విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. తాండవ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. తొలివిడత టెండర్ల ప్రిక్రియలో అధికంగా కోట్‌ చేసిన పనులపై మరోసారి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లామని అధికారులు తెలిపారు.  ఈ కార్యక్రమానికి జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నూతన సీఎస్‌ సమీర్ శర్మ, ఇరిగేషన్ సెక్రెటరీ శ్యామలరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి: సచివాలయాల సేవలను మరింత విస్తరించాలి

మరిన్ని వార్తలు