పోలవరం నిర్మాణాన్ని చూస్తే బాబు తెలివితేటలు అర్థమవుతాయి: సీఎం జగన్‌

20 Sep, 2022 05:31 IST|Sakshi
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌వే

అప్రోచ్‌ చానల్‌ పూర్తికాకుండా కాఫర్‌ డ్యామ్‌లు చేపట్టి రెండేసి గ్యాప్‌లు వదిలారు

అందువల్లే గోదావరి వరద ఉధృతికి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది

సామాన్యుడిని అడిగినా ఈ వెధవ పని చేసింది ఎవరని నిలదీస్తారు 

దాన్ని రిపేరు చేయడానికి ఎన్నెన్నో కుస్తీలు పడుతున్నాం

తప్పు చేసి ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని మాపై నిందలా?

చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా అనర్హుడు

ప్యాకేజీ బ్రహ్మాండమని సిగ్గు లేకుండా అసెంబ్లీలో చెప్పారు

నిర్వాసితులకు మీరిచ్చింది రూ.193 కోట్లు.. మేం వచ్చాక రూ.1,773 కోట్లిచ్చాం

రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లింపుపై జీవో కూడా ఇచ్చాం

భూముల పరిహారాన్నీ ఎకరానికి రూ.5 లక్షలకు పెంచి ఇస్తాం

పారదర్శకంగా పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నాం.. రూ.500 కోట్ల కోసం వెనుకాడం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరాన్ని చంద్రబాబు ఐదేళ్లలో దగ్గరుండి నాశనం చేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా తేటతెల్లం చేశారు. చంద్రబాబు నాశనం చేసిన ప్రాజెక్టును రిపేరు చేయడానికి ఎన్నెన్నో కుస్తీలు పడుతున్నామని చెప్పారు. స్పిల్‌వే, అప్రోచ్‌ చానల్‌ పూర్తి చేయకుండా చంద్రబాబు అప్పర్‌ కాఫర్‌ డ్యామ్, లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌లు చేపట్టి వాటికి రెండేసి చొప్పున గ్యాప్‌లు వదిలారని తెలిపారు. దీంతో నీరు స్పిల్‌వే పైనుంచి వెళ్లలేక గ్యాప్‌ల గుండా వెళ్లడంతో ఉధృతి పెరిగి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని తెలిపారు. ఈ వెధవ పని చేసింది ఎవరని ఏ సామాన్య వ్యక్తిని అడిగినా చంద్రబాబు పేరే చెబుతారని వ్యాఖ్యానించారు.

అన్ని తప్పులు చేసి వాటిని తమపై మోపేందుకు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో కూడిన దుష్ట చతుష్టయం కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. తప్పుల్ని సరి చేసి పోలవరాన్ని యుద్ధప్రాతిపదిక పూర్తి చేసే దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని, ఇది వాస్తవమని స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరంపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పోలవరం పనుల్లో చంద్రబాబు సర్కారు చేసిన తప్పులను ఎండగట్టారు. 

రూ.పది లక్షల పరిహారం ఇస్తాం..
పోలవరంపై ఏం చెప్పామో ఆ మేరకు 2021 జూన్‌ 30న జీవో జారీ చేశాం. ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద చంద్రబాబు హయాంలో రూ.6.86 లక్షలు ఇస్తే మేం అధికారంలోకి వచ్చాక దాన్ని రూ.10 లక్షలు చేస్తామని చెప్పాం. దానికి తగ్గట్లుగా జీవో కూడా ఇచ్చాం. దాని గురించి ఆక్షేపణ లేదు, చర్చ కూడా లేదు. కళ్లుండీ చూడలేకపోతే సమాధానం చెప్పలేం. కళ్లు ఉండి చూడగలిగితే చూడాలని చెబుతున్నా.

  • డ్యామ్‌ పూర్తైన తర్వాత మొదట 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తాం. డ్యామ్‌ భద్రత, కేంద్ర జల సంఘం నిబంధనల మేరకు ఒకేసారి పూర్తిస్థాయిలో నీటి నిల్వ సరికాదు. 
  • పోలవరంలో 1,06,006 మంది నిర్వాసిత కుటుంబాలుంటే 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోకి 20,946 మంది వస్తారు. మిగిలిన 85,060 మంది 45.72 మీటర్ల కాంటూర్‌ పరిధిలోకి వస్తారు. 41.15 కాంటూర్‌ పరిధిలోకి వచ్చే 14,110 మంది నిర్వాసితులకు పునరావాసం పూర్తైంది. దీనికైన ఖర్చు రూ.1,960.95 కోట్లు. వీరిలో 707 మందికి రూ.44.77 కోట్లతో 2014 కంటే ముందే పునరావాసం కల్పించారు. 2014–19 వరకు 3,073 మంది పునరావాసం కోసం రూ.193 కోట్లు ఖర్చు చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు 10,330 మంది నిర్వాసితుల కోసం రూ.1,773 కోట్లు ఖర్చు చేశాం. 41.15 కాంటూర్‌ వరకు పునరావాస పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌లోగా మిగిలిన 6,836 నిర్వాసిత కుటుంబాలకు కూడా పునరావాసం కల్పించేందుకు ప్రణాళిక ఇచ్చాం. 
  • 41.15 కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పరిహారాన్ని రూ.6.86 లక్షలకు బదులు రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పాం. ఇందుకయ్యే ఖర్చు కేవలం రూ.500 కోట్లు మాత్రమే. దీనికోసం విపక్షాలు బాధపడాల్సిన పని లేదు. బటన్‌ నొక్కి రూ.6,500 కోట్లు అమ్మఒడికి, రూ.6,700 కోట్లు ఆసరా కోసం, రూ.4,700 కోట్లు చేయూతకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాం. రూ.500 కోట్లు ఇవ్వలేని పరిస్థితులు వస్తాయని అనుకోవాల్సిన పనిలేదు. 41.15 కాంటూర్‌ పరిధిలోని వారికి పూర్తిగా పునరావాసం కల్పించేలోపే రూ.500 కోట్లు ఇస్తాం.
  • భూములు కోల్పోయిన వారికి గతంలో అతి తక్కువగా ఎకరాకు రూ.1.50 లక్షలు చొప్పున ఇచ్చారు. వారికి కూడా పెంచి రూ.5 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం.  

అర్ధరాత్రి.. సిగ్గు లేకుండా
పోలవరంపై ఖర్చు పెట్టిన రూ.2,900 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సి ఉంది. మనం ఎదురు డబ్బులిచ్చాం. కేంద్రం నుంచి ఆ డబ్బులు ఇంకా రాలేదు. ఈ పరిస్థితికి కారణం ఆ రోజు చంద్రబాబు అర్ధరాత్రి పూట స్పెషల్‌ ప్యాకేజీకి అంగీకరించడమే. 2011 ప్రకారం పాత రేట్లే ఇస్తాం, అంతకన్నా ఎక్కువ ధర ఇవ్వం అని వాళ్లు చెప్పినప్పుడు... ఏదైనా ప్రాజెక్టు ముందుకు పోయేకొద్దీ రేట్లు పెరుగుతాయి కదా? పెరిగిన రేట్లు మీరు ఇవ్వకపోతే ఎలా?  పోలవరం ప్రాజెక్టు అ«థారిటీ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీనే కదా? వాళ్లే కదా అమలు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేట్‌ మాత్రమే చేస్తుంది కదా? మరి అలాంటప్పుడు ఇలాంటి నిబంధన పెట్టడం ధర్మమేనా? అని అడగాల్సింది పోయి చంద్రబాబు ఆరోజు గుడ్డిగా అంగీకరించారు.

అరుణ్‌ జైట్లీ అర్ధరాత్రి స్టేట్‌మెంట్‌ ఇస్తుంటే మీ సుజనా చౌదరి, కేంద్ర కేబినెట్‌లో ఉన్న మీ మంత్రులు అంతా పక్కనే నిలబడి దానికి అంగీకరించారు. మరుసటి రోజు చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మాండమైన ప్యాకేజీ వచ్చిందని సిగ్గులేకుండా చెప్పారు. దానివల్ల ఇప్పుడు పాత రేట్లే ఇస్తాం అని వాళ్లు గట్టిగా భీష్మించడంతో ఒప్పించడానికి ఎన్నో అగచాట్లు పడుతున్నాం. అగచాట్లు పడుతూనే మరోవైపు రూ.2,900 కోట్లు ఎదురు మన డబ్బులే ఇచ్చాం. ప్రాజెక్టు నిర్మాణంలో మన డబ్బే ఇరుక్కుని ఉంది. ఆ డబ్బులు ఇంకా వెనక్కి తీసుకురాలేకపోతున్నాం. అందుకు కారణం మీ పుణ్యమే.

మీ ఇష్టం వచ్చిన వాళ్లను అడగండి. పార్టీలతో సంబంధం లేకుండా ఏ తటస్థ వ్యక్తినైనా అడిగి చూడండి. ఈయన్ని (చంద్రబాబు) ముఖ్యమంత్రిగా ఎవరు చేశారయ్యా అని అడుగుతారు. ఇంత వెధవ పని చేసింది ఎవరయ్యా? అని అంటారు. మీరు చేయించిన తప్పును ఎదుట వారిపై రుద్ది వేలెత్తి చూపించేందుకు రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. మా ఖర్మ ఏమిటంటే... మీకే ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, టీవీ 5 ఉంది. ఎల్లో మీడియా మొత్తం మీదే. అబద్ధాన్ని నిజం చేయడానికి గోబెల్స్‌ ప్రచారాలు చేస్తున్నారు. – అసెంబ్లీలో టీడీపీ సభ్యులనుద్దేశించి సీఎం జగన్‌


సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌..

బాబు దగ్గరుండి నాశనం చేశారిలా..

  • పోలవరం పనులను చంద్రబాబు ఎలా నాశనం చేశారో మీరే చూడండి. అప్రోచ్‌ చానల్‌ తవ్వాల్సిన ప్రాంతంలో పనులు చేయకుండా బీడుగా వదిలేశారు. గోదావరి నది 2.1 కి.మీ. వెడల్పున ప్రవహిస్తుంది. నదిలోకి నీళ్లు వస్తున్నప్పుడు అటువైపు స్పిల్‌వే  కట్టాలి. స్పిల్‌వే పూర్తి చేసి నీళ్లు అటువైపు (స్పిల్‌వే వైపు) మళ్లించి అప్పుడు కాఫర్‌ డ్యామ్‌ పనులు చేయాలి. కాఫర్‌ డ్యామ్‌ తాత్కాలిక నిర్మాణం. అది మెయిన్‌ డ్యామ్‌ కట్టడానికి ఫెసిలిటేట్‌ చేస్తుంది. స్పిల్‌వే పనులు, అప్రోచ్‌ చానల్‌ పూర్తి చేసి నీళ్లు మళ్లించే వెసులుబాటు కల్పించాక కాఫర్‌ డ్యామ్‌ కట్టాలి. దాని తర్వాత మెయిన్‌ డ్యామ్‌ కట్టాలి. కాఫర్‌ డ్యామ్‌–1, మధ్యలో మెయిన్‌ డ్యామ్, ఇటువైపు నుంచి నీళ్లు తన్నకుండా కాఫర్‌ డ్యామ్‌–2 కట్టాలి. కాఫర్‌ డ్యామ్‌లు, మెయిన్‌ డ్యామ్‌ పనుల జోలికి వెళ్లకముందే స్పిల్‌వే పనులు పూర్తి కావాలి. 


ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల్లో గ్యాప్‌ల ద్వారా ప్రవహిస్తున్న వరద

  • 40 ఏళ్లు ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే పెద్దమనిషి చంద్రబాబుకు ఏం తెలివితేటలున్నాయో కానీ ఆయన ఎమ్మెల్యే కావడానికి కూడా అర్హుడు కాదు. ఆ స్థాయిలో మాయ చేసిన మనిషి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటంటే.. స్పిల్‌వే, అప్రోచ్‌ చానల్‌ పూర్తికాకుండా, మరోవైపు అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ పూర్తిచేయకుండా రెండు గ్యాప్‌లు విడిచిపెట్టారు. లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌లోనూ రెండు గ్యాప్‌లు విడిచిపెట్టారు. దీనివల్ల నీరు అటు స్పిల్‌వే వైపు పోలేక మీరు వదిలిన ఆ గ్యాప్‌ల గుండా వెళ్లింది. 2.1 కి.మీ వెడల్పున వెళ్లాల్సిన నీళ్లు గ్యాప్‌ తక్కువ కావడంతో వేగం పెరిగి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. మీరు ప్రణాళిక లేకుండా కట్టడం వల్లే ఇలా జరిగింది. 


వరద కారణంగా ఈసీఆర్‌ఎఫ్‌లో కోతకు గురైన ప్రాంతం

  • అప్రోచ్‌ చానల్‌ మేం వచ్చేటప్పటికి అసంపూర్తిగా ఉంది. మే నెలలో అప్రోచ్‌ చానల్‌ పనులు మొదలుపెట్టి చేశాం. జూన్‌ 2021 నాటికి అప్రోచ్‌ చానల్‌లోకి నీళ్లు మళ్లించాం. మార్చి 2022 నాటికి అప్రోచ్‌ చానల్‌ పూర్తి చేసి నీళ్లు మళ్లించాం. డ్యామ్‌ పూర్తి చేసి స్పిల్‌వే గేట్లు కూడా పెట్టాం. ఇప్పుడు నీళ్లు కిందకు వస్తున్నాయి. ఇది ముందుగానే జరగాల్సింది. అలా కాకుండా కాఫర్‌ డ్యామ్‌ పనులు మొదలుపెట్టి, అవి పూర్తి కాకుండా 2.1 కి.మీ. పొడవైన గోదావరిలో రెండు గ్యాపులు వదిలేశారు. నీళ్లు ఆ గ్యాపుల గుండా పోవడంతో కోతకు గురైంది. ఇదీ వాస్తవం.
  • చంద్రబాబు 2018లో అసలు స్పిల్‌వే పనులు ఏమాత్రం పూర్తి కాకుండానే పునాదులు వేయగా ఆయన కుమారుడు, మనవడు, భార్య.. జయము జయము చంద్రన్నా అంటూ పనులు పూర్తైనట్లు ఇంప్రెషన్‌ ఇచ్చారు. 2019 మార్చిలో పిల్లర్లు పైకి లేచిన తర్వాత గేట్లు పెట్టాలి. గేట్లు పెట్టిన తర్వాత కానీ స్పిల్‌వే పూర్తి కాదు. కానీ పిల్లర్లు పూర్తవలేదు. మేం వచ్చిన తర్వాత ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్లాం.


ప్రాజెక్ట్‌ గ్యాలరీలో చంద్రబాబు కుటుంబం (ఫైల్‌)

  • జూన్‌ 2022 నాటికి (సీఎం ఫొటోలను చూపించారు) మీరు వదిలేసిన పనులను పూర్తి చేశాం. గణనీయమైన ప్రగతి అంటే ఇదీ. పిల్లర్లు పూర్తి చేయడమే కాకుండా గేట్లు పెట్టి అప్రోచ్‌ చానల్‌ నుంచి నీళ్లు మళ్లించి స్పిల్‌ చానల్‌ నుంచి బయటకు వెళ్లేటట్లు చేస్తున్నాం. ఇది చేయకుండా బుద్ధి ఉన్నవారెవరైనా కాఫర్‌ డ్యామ్‌ కడతారా? మీ (టీడీపీ సభ్యులు) మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

2019 నవంబర్‌–2022 ఆగస్టు (స్పిల్‌వే ఫొటోలను చూపిస్తూ) పనుల పురోగతిని సీఎం జగన్‌ వివరించారు

  • 2019లో కాఫర్‌ డ్యామ్‌లో రెండు గ్యాపులను  వదిలిపెట్టారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఒకచోట 380 మీటర్ల గ్యాప్, మరోచోట 300 మీటర్ల గ్యాప్‌ వదిలిపెట్టారు. అంటే 2.1 కి.మీ. వెడల్పున పోవాల్సిన నీళ్లు ఈ రెండు గ్యాప్‌ల నుంచి వెళ్లే పరిస్థితి రావడంతో కోతకు గురైంది. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో ఒకవైపు 680 మీటర్లు, మరోవైపు 120 మీటర్ల గ్యాప్‌ వదిలారు. నీళ్లన్నీ ఈ గ్యాప్‌ల నుంచే పోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమై కోత ఏర్పడింది. ఇప్పుడు దాన్ని మళ్లీ పునరుద్ధరించాల్సి వచ్చింది. డయాఫ్రమ్‌ కింద నుంచి కోతకు గురైంది. గుంతలు పడ్డాయి. దాన్ని మళ్లీ కట్టుకుంటూ వస్తున్నాం. ఆలస్యం కావడానికి మీరు చేసిన ఈ తప్పుడు పనులే కారణం. మీరు చేసిన తప్పులు మీకు అర్థం కాకపోగా మళ్లీ అవతలి వారిపై వేలెత్తి చూపడానికి మీకు (టీడీపీ) మనసెలా వస్తోంది? మనుషుల్లా ఆలోచన చేస్తున్నారా? రాక్షసుల్లా ఆలోచన చేస్తున్నారా? వేలెత్తి ఎవరిమీదో చూపించాలనే మీ దుర్బుద్ధే కనిపిస్తోంది. మెయిన్‌ డ్యామ్‌లో కూడా గ్యాపులు ఉంచారు. దీనికి పూర్తిగా మీరే  బాధ్యత వహించాలి. 


జూన్‌ 2019లో అసంపూర్తిగా ఉన్న అప్రోచ్‌ చానల్‌ ఆగస్టు 2022కి పూర్తి అయింది ఇలా..

  • మొత్తంగా 2021 జూన్‌ నాటికే అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశాం. అయితే దిగువ కాఫర్‌ డ్యామ్‌ 30.5 మీటర్లు ఎత్తు పెంచాల్సిన చోట వరద అనుకున్న దానికన్నా ఎక్కువగా రావడంతో పాటు కేంద్రం నుంచి డిజైన్ల క్లియరెన్స్‌లో జాప్యం జరిగింది. దీనివల్ల దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు అనుకున్న మేరకు వేగంగా జరగలేదు. ఇది 30.5 మీటర్ల ఎత్తుకు కట్టాల్సి ఉండగా 21 నుంచి 23 మీటర్ల ఎత్తువరకే కట్టగలిగారు. ఇక్కడ 680 మీటర్ల వెడల్పుతో ఒకటి, 120 మీటర్ల వెడల్పుతో మరొకటి ఇలా రెండు గ్యాప్‌లను కింద పునాదుల నుంచి వేసుకుని రావడం వల్ల ఆలస్యం అయింది. కొద్దిగా సమయం దొరికితే 30.5 మీటర్ల వరకు దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తయ్యేది. అయితే వర్షాకాలంలో పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్‌లో వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే నవంబరులో పనులు మొదలవుతాయి. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేసేలా అడుగులు ముందుకు పడతాయి. ఇది వాస్తవం. దీన్ని వక్రీకరించే ప్రయత్నాలు చేస్తే మీరే చులకన అవుతారు. ప్రజలకు అన్నీ తెలుసు. తెలియదని మీరు మాత్రమే అనుకుంటున్నారు.  


మార్చి 2019లో అసంపూర్తిగా ఉన్న స్పిల్‌ చానల్‌ ఆగస్టు 2022కి పూర్తి అయింది ఇలా..

ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి: పోలవరం ప్రాజెక్టు: నాడు అలా.. నేడు ఇలా

మరిన్ని వార్తలు