కళ్ల ముందు కనిపిస్తున్నా.. కళ్లార్పకుండా అబద్ధాలు

1 Dec, 2020 17:46 IST|Sakshi

చంద్రబాబు అసత్య ఆరోపణలపై సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజం

రెండో రోజు వాడివేడిగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శీతాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం కూడా వాడి వేడిగా జరుగుతున్నాయి. పేదలకు పక్కా ఇళ్ల (టిడ్కో)పై సభలో చర్చ సందర్భంగా ప్రభుత్వంపై విపక్షనేత చంద్రబాబు అసత్య ఆరోపణలు చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మనిషి వయసు పెరిగినా, స్పష్టంగా మేనిఫెస్టో అన్నది కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడుకి నరకంలో కూడా చోటు దొరకదని సీఎం ధ్వజమెత్తారు. (చదవండి: మీ సంగతి చూస్తా.. స్పీకర్‌కు చంద్రబాబు బెదిరింపు)

సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..:
పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి ఇంతకు ముందు ఇదే మేనిఫెస్టోను మంత్రి బొత్స సత్యనారాయణ చూపించారు. అదే బైబిల్, భగవద్గీత, ఖురాన్‌ అని చెప్పాం.
నేను పాదయాత్రలో ఏం మాట్లాడాను అన్నది ఇప్పుడు కూడా టెలికాస్ట్‌ చేయిస్తా.
మేనిఫెస్టోలో ఏం చెప్పామన్న దాంట్లో ఒక లైన్‌ తీసేయిస్తాడు. ఆయనకు అనుకూలంగా మాట్లాడతాడు.
మేనిఫెస్టోలో ఏం రాశామన్నది కూడా చదివి వినిపిస్తాను అంటూ  సీఎం.. చదివారు.
‘పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఒక్కొక్క ఇల్లు 300 అడుగులట. అడుగుకు రూ.2 వేలకు అమ్మారు. అందులో 3 లక్షల రూపాయలను పేదవాడి పేరుతో అప్పుగా రాసుకుని, 20 ఏళ్ల పాటు నెల నెలా రూ.3 వేలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి. ఈ అప్పు భారం రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది’.
మరి ఆయన కళ్లకు గుడ్డి వచ్చిందా? కళ్లు కనిపించడం లేదా? 300 అడుగులు అన్నది ఆయనకు కనిపించడం లేదా? 
అందుకే అదే మేనిఫెస్టోను స్క్రీన్‌లో చూపించండి. ఆ 300 అడుగులు కనిపించడం లేదా?
ఇదే మేనిఫెస్టోకు సంబంధించి నేను మాట్లాడిన మాటలను ప్లే కూడా చేద్దాము. ఆ 300 అడుగులు అన్నది ఆయనకు ఎందుకు కనిపించడం లేదు? కళ్లకు గుడ్డి వచ్చిందా? లేక పూర్తిగా బుద్ధి వక్రీకరించిందా?
నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు?. ఆయనకు క్లారిటీ ఉందా?
ఆరోజు కూడా నేను ఇదే చెప్పాను. 300 అడుగుల ఇల్లు. ఒక్కొక్క అడుగుకు రూ.2 వేల చొప్పున అమ్మారు. ఆ విధంగా ఇంటికి రూ.6 లక్షలు. అందులో రూ.1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం, మరో రూ.1.5 లక్షలు
రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, మిగిలిన రూ.3 లక్షలను పేదవారి పేరుతో అప్పు కింద రాసుకుంటారంట. ఆ అప్పు కింద నెల నెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు కట్టాలంట. 
దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అప్పు తీసేస్తామని చెప్పాం. 
అంత క్లియర్‌కట్‌గా మేము చెబితే, చంద్రబాబునాయుడు  ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదు.
నేను సరిగ్గా ఏది మాట్లాడానో అదే మేనిఫెస్టోలో పెట్టాము. అయినా ఈ మనిషి ఏదేదో మాట్లాడుతున్నాడు.
ఎక్కడికక్కడ ఆయన వక్రీకరిస్తున్నాడు. మేము ఏం చెప్పాము. ఆయన ఏం మాట్లాడుతున్నాడు?
అసలు ఆయనకు బుర్ర ఏమైనా ఉందా? వాటీజ్‌ రాంగ్‌ విత్‌ దిస్‌ మ్యాన్ అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు