శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

27 Jan, 2022 16:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్‌ ఎండీ గజనన్‌ నబర్, కమర్షియల్‌ హెడ్‌ శరద్‌ మధోక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 14 నెలల్లోప్లాంట్‌ ప్రారంభం కావడం ఒక మైలురాయి అని కొనియాడారు. 220 టన్నుల ఆక్సిజన్‌ తయారీ చేయడం చాలా ముఖ్యమైన విషయమన్నారు. 144 పీఎస్‌ఏ ప్లాంట్లు కూడా వివిధ ఆస్పత్రుల్లో పెట్టామని, మరో 32 ప్లాంట్లు కూడా పెడుతున్నామని పేర్కొన్నారు. 
చదవండి: CM YS Jagan: చెప్పాడంటే.. చేస్తాడంతే!

దీనివల్ల ఆక్సిజన్‌ విషయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, 24వేల ఆక్సిజన్‌ బెడ్లు తయారు చేశామని సీఎం జగన్‌ అన్నారు. కోవిడ్‌ లాంటి విపత్తులు వచ్చినప్పుడు సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 300 టన్నుల ఆక్సిజన్‌ తయారీలో ఉందని, ఈ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి దీనికి అదనంగా వచ్చిచేరుతుందని పేర్కొన్నారు.
చదవండి: పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు: విజయ్‌ కుమార్‌

కోవిడ్‌కే కాదు, పరిశ్రమలకూ ఆక్సిజన్‌ చాలా ముఖ్యమని నోవా ఎయిర్‌ ఎండీ గజనన్‌ నబర్‌ తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్లాంట్‌పెట్టామని ఇందుకు ఏపీ సరైనదని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, 14 నెలల్లో ప్లాంట్‌ను నిర్మించామని తెలిపారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బాగా సహకరించిందని చెప్పారు. కోవిడ్‌ వేవ్‌ల సమయంలో రవాణాకు, మానవవనరులకు కొరత లేకుండా అధికారులు చూశారని, అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా కోవిడ్‌ కారణంగా ఆక్సిజన్‌ కొరత రాకుండా ఓ ప్లాంట్‌ను తీసుకు రావాలని గతంలో ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. తద్వారా మెడికల్‌ ఆక్సిజన్‌కు లోటు రాకుండా రాష్ట్రం స్వయం సమృద్ధిసాధించాలంటూ అధికారులకు లక్ష్య నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోవిడ్‌ నేపథ్యంలో మెడికల్‌ ఆక్సిజన్‌ లోటు లేకుండా చూసే చర్యల్లో భాగంగా ఈ కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ రోజుకు 220 టన్నుల సామర్ధ్యం కలిగి ఉంది. ఈ ప్లాంట్‌లో మెడికల్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ నైట్రోజన్, లిక్విడ్‌ ఆర్గోన్‌ వాయువుల తయారీ చేయనున్నారు. నోవా ఎయిర్‌తో జనవరి 24, 2020న ఏపీ ప్రభత్వం ఒప్పందం కుదుర్చుకుంది. డిసెంబర్‌ 18, 2020న పనులు ప్రారంభం కాగా, నవంబర్‌ 2021న పనులు పూర్తయ్యాయి.

మరిన్ని వార్తలు