ఈసారి ‘క్రాస్‌’ పుంజులతో.. కమిటీలతో కట్టడి చేస్తాం!

9 Jan, 2023 08:50 IST|Sakshi

ఈ ఏడాది కోడి పందేలకు కొత్తరూపు

రాష్ట్రంలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా ఎక్కువగా ఉంటాయని అంచనా

లాడ్జిలు, అతిథి గృహాలన్నీ ఇప్పటికే హౌస్‌ఫుల్‌     కుటీర పరిశ్రమగా మారిన కోడిపుంజుల నిర్వహణ

జూదాలు వద్దు.. క్రీడలే ముద్దంటున్న పోలీసు శాఖ

కైకలూరు: సంక్రాంతి అంటేనే కోడిపందేలకు పెట్టింది పేరు. కత్తులతో కుత్తుకలు తెగే పుంజుల పోరాటాన్ని రక్తికట్టించేందుకు నిర్వాహకులు ఎప్పటిలాగే ఈ ఏడాదీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి విభిన్నంగా క్రాస్డ్‌ జనరేషన్‌ పుంజులను బరిలోకి దించుతున్నారు. ఈ రోమాంచిత పోటీలకు జస్ట్‌ ఆరు రోజులే గడువు మిగిలి ఉంది.

టిక్‌..టిక్‌..టిక్‌..
గతేడాది జనవరిలో కోడిపందేల రూపంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.900 కోట్లు చేతులు మారాయన్నది ఓ అంచనా. ఇందులో కోడిపందేలకు పెట్టింది పేరైన ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల వాటా అత్యధికంగా రూ.500 కోట్లు ఉండొచ్చు. నోట్ల రద్దు, కరోనా ప్రభావంతో గతంలో పందేల జోరు తగ్గినా, ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించడంతో రాష్ట్రంలో ఈ ఏడాది ఇంకా ఎక్కువగా పందేలు ఉంటాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కోడిపందేల నిర్వాహకులు పందెపు బరులను సిద్ధంచేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు.. ఇప్పటికే పలు జిల్లాల్లో లాడ్జిలు, అతిథి గృహాలు బుక్కయిపోయాయి.

కోడి పందేలు.. కొత్త పుంతలు..
ఈ ఏడాది కోడిపందేలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. క్రాస్‌ జనరేషన్‌ కోడిపుంజుల హవా కొనసాగుతోంది. అమెరికన్‌ గేమ్‌ పాల్, అమెరికన్‌ పెర్విన్, బ్రెజిల్‌ జాతి కోళ్లను తీసుకొచ్చి దేశీయ నెమలి, డేగ వంటి జాతి కోళ్లతో క్రాసింగ్‌ చేయిస్తున్నారు. పందేనికి సిద్ధమైన వీటి ధర రూ.లక్ష పైమాటగానే ఉంది. ఇక కోడిపుంజుల పెంపకాన్ని పలు జిల్లాల్లో నిర్వాహకులు కుటీర పరిశ్రమగా మార్చుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో దాదాపు 300 కోడిపుంజుల శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 18 నెలల పాటు పుంజులను పోటీలకు సిద్ధంచేయడానికి ఒక్కో శిక్షకుడికి రూ.15 వేలు జీతం ఇస్తున్నారు. యంత్రాలలో కోడిగుడ్లను పొదిగించి నాణ్యమైన పుంజు జాతులను తయారు­చేస్తున్నారు. 

మార్పు కోసం పోలీసుల యత్నం
హైకోర్టు ఆదేశాలతో కోడిపందేలను అడ్డుకోవడానికి గతంలో పోలీసులతో పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా  రంగంలోకి దిగారు. పోలీసు యాక్ట్‌ 144 సెక్షన్‌ను విధించారు.  బైండోవర్లు చేసి, వేలాదిగా కోడి కత్తులను సీజ్‌ చేశారు.  ఈ ఏడాది కూడా భారీగా కోడికత్తులను సీజ్‌ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందేలకు సంబంధించి 900 కేసులు నమోదు చేశారు.  పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్, క్రికెట్‌ వంటి పోటీలను మార్పు కోసం నిర్వహిస్తున్నారు. 

కమిటీలతో కట్టడి చేస్తాం.. 
సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందేలు, జూదాలను కట్టడి చేయడానికి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటుచేశాం. ఏలూరు జిల్లాలో కేవలం 
15 రోజుల్లోనే 45 కేసులు నమోదు చేశాం. ఇప్పటికే పెట్రోలింగ్‌ టీంలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా జూదాల వైపు దృష్టి మళ్లకుండా పోలీస్‌స్టేషన్ల పరిధిలో వాలీబాల్, క్రికెట్‌ వంటి పోటీలను పోలీసు శాఖ ఏర్పాటుచేసింది. 
– రాహుల్‌దేవ్‌ శర్మ, ఎస్పీ, ఏలూరు జిల్లా 

మరిన్ని వార్తలు