కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి అనిల్‌ కుమార్‌

21 Sep, 2020 14:22 IST|Sakshi

పోలవరం బకాయిలు చెల్లించాలని జలశక్తి మంత్రికి విజ్ఞప్తి

ఆయన వెంట మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్‌, లావు కృష్ణ దేవరాయలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎంపీలు మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్‌, లావు కృష్ణ దేవరాయలు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ను సోమవారం కలిశారు. పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం వైఎస్‌ జగన్ ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారని తెలిపారు. 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి అనిల్‌ కుమార్‌ వెల్లడించారు. పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన సెటిల్ చేయాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అనిల్‌ కుమార్‌ తెలిపారు. 4 వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు త్వరితగతిన విడుదల చేస్తామని మంత్రి గజేంద్ర సింగ్‌ హామినిచ్చారని పేర్కొన్నారు. జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీని కేంద్రం నిర్ణయిస్తే మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అనిల్‌కుమార్‌ స్పష్టం చేశారు.
(చదవండి: ఎందుకు.. ఏమిటి.. ఎలా?)

మరిన్ని వార్తలు