కుట్రపూరిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ

12 Sep, 2020 15:37 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మత సామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కుట్రపూరిత చర్యలకు పాలడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతం సవాంగ్‌ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతాచర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పరివ్యేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలను అప్రమత్తం చేశామని తెలిపారు గౌతం సవాంగ్‌. (చదవండి: తప్పుడు ఆరోపణలు ఉపేక్షించం)

రాజకీయ లబ్ధి కోసమే గుడివాడ ఘటన: రవీంద్రనాథ్‌ బాబు
నిరాదరణ ఆరోపణలతో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు హెచ్చరించారు. గుడివాడలో జరిగిన సంఘటన రాజకీయ లబ్ధి కోసమే జరిగింది అన్నారు. నిరాదరణ ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాగుడుకి బానిసలైన ఇద్దరు వ్యక్తులు మద్యం కొనడానికి అవసరమైన డబ్బుల కోసం హుండీని బద్దలు కొట్టారని విచారణలో వెల్లడించారన్నారు. హుండీలో 600 రూపాయలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలిపారు. జిల్లాలో ఉన్న మతాలకు సంబంధించిన అన్ని ప్రార్థనామందిరాల దగ్గర తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చాలని సూచించామన్నారు. ప్రశాంతంగా ఉన్న మతాల మధ్య వివాదాలు రాజేసి వ్యక్తిగత, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే చర్యలు తప్పవని రవీంద్రనాథ్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు