23 నుంచి ఏపీ ఈఏపీసెట్‌ బైపీసీ స్ట్రీమ్‌ కౌన్సెలింగ్‌

22 Dec, 2021 03:28 IST|Sakshi

మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ

సర్టిఫికెట్ల పరిశీలన 27 నుంచి 29 వరకు ఆప్షన్ల నమోదు 28 నుంచి 30 వరకు

వచ్చే నెల 3న సీట్ల కేటాయింపు

బీటెక్‌ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మాడీలో ప్రవేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈఏపీసెట్‌) బైపీసీ స్ట్రీమ్‌ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. బీటెక్‌ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. జనవరి 3న సీట్లు కేటాయించనున్నారు. అదే నెల 6లోగా విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నీట్‌ కౌన్సెలింగ్‌ జరగనందున బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ (బీవీఎస్సీ), అగ్రికల్చర్‌ బీఎస్సీకి కౌన్సెలింగ్‌ నిర్వహించడం లేదు.  

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా..
► అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు: డిసెంబర్‌ 23 నుంచి 25 వరకు
► ధ్రువపత్రాల పరిశీలన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ (హెల్ప్‌లైన్‌ సెంటర్స్‌): డిసెంబర్‌ 27 నుంచి 29 వరకు
► ఆప్షన్ల నమోదు: డిసెంబర్‌ 28 నుంచి 30 వరకు
► ఆప్షన్ల సవరణ: డిసెంబర్‌ 31
► సీట్ల కేటాయింపు: జనవరి 3, 2022
► సెల్ఫ్‌ రిపోర్టింగ్, కాలేజీల్లో రిపోర్టింగ్‌: జనవరి 4 నుంచి 6 వరకు. 

మరిన్ని వార్తలు