కుప్పంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది: ఎస్‌ఈసీ నీలం సాహ్ని

16 Nov, 2021 15:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని స్పందించారు. ఈ మేరకు మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. వెబ్‌కాస్టింగ్, వీడియో గ్రఫీ, సీసీటీవీ కెమెరాల నిఘాలో పోలింగ్‌ జరిగిందని నీలం సాహ్ని పేర్కొన్నారు. కుప్పంలో పోలింగ్‌ బూత్‌ వెలుపల చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందన్నారు. చిత్తూరు ఎస్పీ కుప్పంలో ఉండి, పరిస్థితిని శాంతిభద్రతలను స్వయంగా పర్యవేక్షించారని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులు ప్రతి బూత్‌కు వెళ్లి పోలింగ్‌ తీరును స్వయంగా పరిశీలించారని తెలిపారు.
చదవండి: చంద్రబాబు స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు: మంత్రి బొత్స సత్యనారాయణ

పార్టీలు నియమించుకున్న ఏజెంట్లు అంతా పోలింగ్‌బూత్‌ల్లో ఉన్నారని ఎస్‌ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, రీ పోలింగ్‌ నిర్వహించమని ఎవరు కూడా కోరలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘానికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు అధికారులకు పంపించినట్లు, వారు వెంటనే తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి పంపించారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు