వాణిజ్య పన్నుల వసూళ్లలో ఏపీ ఫస్ట్

28 Jan, 2021 05:33 IST|Sakshi

ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి

జీఎస్టీ వసూళ్లలో 2 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడి  

సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల వసూళ్లకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం, దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలవడంపై ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జీఎస్టీ ఆదాయం 2.07 శాతం వృద్ధితో రూ.345.24 కోట్లు పెరిగి రూ.17,020.36 కోట్లకు చేరుకుందని చెప్పారు. జీఎస్టీ పాత బకాయిల వసూలు చేయడానికి చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో అధికారులు మంచి పనితీరు కనబరచడంతో లక్ష్యాన్ని మించి వసూళ్లు నమోదయ్యాయన్నారు. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా రూ.942.41 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.1,073.03 కోట్లు వసూలయ్యాయని తెలిపారు.

ఇందుకు కారణమైన 257 మంది అధికారులకు ప్రోత్సాహకాలు, ప్రశంసాపత్రాలిస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న దశలవారీ మద్య నిషేధం వల్ల లిక్కర్‌పై వ్యాట్‌ ఆదాయం రూ.4,091 కోట్లు కోల్పోయినట్లు తెలిపారు. వాణిజ్య శాఖ సొంత కార్యాలయాలు నిర్మించుకోవడానికి జిల్లాల వారీగా స్థలాలను పరిశీలించడంతో పాటు, హైదరాబాద్‌లో ఉన్న కామన్‌ డేటా సెంటర్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ పీయూష్‌ కుమార్‌తో పాటు అధికారులను  అభినందించారు.  

మరిన్ని వార్తలు