జగనన్న స్మార్ట్‌ టౌన్స్‌ ఎంఐజీ లే అవుట్లకు ప్రభుత్వ భూములు

27 Jul, 2021 20:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ దిశగా మరో ముందడుగు వేసింది. జగనన్న స్మార్ట్‌ టౌన్స్‌ ఎంఐజీ గృహాల లే అవుట్‌లకు ప్రభుత్వ భూములు కేటాయించింది. వివిధ శాఖల పరిధిలోని నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను మున్సిపల్ శాఖకు అప్పగించాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 

కాగా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వం చేపట్టనున్న స్మార్ట్‌టౌన్ల ప్రాజెక్టుకు పట్టణ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అన్ని వసతులతో లేఅవుట్లు వేసి లాభాపేక్ష లేకుండా ప్లాట్లు విక్రయించే ఈ ప్రాజెక్టు పట్ల మధ్యతరగతి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. స్మార్ట్‌టౌన్ల ప్రాజెక్టుపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న డిమాండ్‌ సర్వేనే అందుకు నిదర్శనం.

ఏప్రిల్‌ నెల 1 నుంచి 10 వరకు మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్వహించిన డిమాండ్‌ సర్వేలో ఏకంగా 2,32,369 ప్లాట్లకు ఆసక్తి కనబరచడం విశేషం. వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఈ డిమాండ్‌ సర్వే నిర్వహించారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు చొప్పున మాత్రమే సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.

మరిన్ని వార్తలు