కరోనా టైంలో వాలంటీర్ల పనితీరు అద్భుతం: శ్రీకాంత్‌ రెడ్డి

1 Oct, 2020 17:20 IST|Sakshi

గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రధాని ప్రశంసించారు

పాడేరు సహా 16 ప్రాంతాల్లో మెడికల్‌ కాలేజీలు

స్టేలు ఎత్తివేస్తే చంద్రబాబు అవినీతి బయటపడుతుంది

సాక్షి, తాడేపల్లి: గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి రేపటితో ఏడాది పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పని తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామ స్వరాజ్యం.. గాంధీజీ కల... అనే మాటలు 70 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం.ఆ మాటలను నిజం చేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది. గతంలోలో పింఛను, రేషన్ కార్డ్ కావాలంటే ఎమ్‌డీఓ ఆఫీస్ వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామంలో సమస్యలు ఆ గ్రామంలోనే పరిష్కారం అవుతున్నాయి. పింఛన్, రేషన్ కార్డులు కూడా వెంటనే మంజూరు అవుతున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు, పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీలు నిర్ణయించాలి. కానీ ఇప్పుడు ఎవరి సిఫార్సులు అక్కర్లేదు. ఇంత మంచి వ్యవస్థను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాను. గ్రామంలో అద్భుతమైన సచివాలయ బిల్డింగులు ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో అవసరమైన ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో మండలానికి ఇలాంటి బిల్డింగ్ ఒక్కటి కూడా ఉండేది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లను అవమాన పరిచే విధంగా మాట్లాడారు’ అంటూ శ్రీకాంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: ‘చర్చకు బాబు రాకుంటే లోకేష్‌ను పంపండి’)

కరోనా సమయంలో వాలంటీర్ల పనితీరు అద్భుతమని ప్రశంసించారు శ్రీకాంత్‌రెడ్డి. ‘వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కరోనా టైంలో ఆయుష్ మాత్రలు కేవలం రెండు గంటల్లోనే పంపిణీ చేశాం. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రధానమంత్రి కూడా అభినందించారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెల్లవారకముందే అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా పింఛన్ అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో 47 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉంటే.. ఇప్పుడు 61, 65,000 లబ్ధిదారులు ఉన్నారు. నెల.. నెల పింఛన్ పొందే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇది ఒక అద్భుతం. మా ప్రభుత్వంలో రైతులంతా ఆనందంగా ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వం. గతంలో విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడి పోలీసుల చేత దెబ్బలు తినే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ పొలం దాకా విత్తనాలను సప్లై చేస్తోంది. చెత్త ద్వారా సంపద సృష్టిస్తామని గతంలో లోకేష్ చెప్పాడు. సంపద ఎక్కడ ఎలా సృష్టించాడు’ అని శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. 

‘నీరు-చెట్టు పేరుతో దోచుకున్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన అప్పులు పెరుగుతాయి... ఆస్తులు తగ్గుతాయి. మా ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవం తీసుకు వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 16 మెడికల్ కాలేజీలు పెడుతున్నాం. పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. చంద్రబాబు తనను తానే రక్షించుకో లేకపోయారు. గత ప్రభుత్వంలో నా పైన తప్పుడు కేసులు పెట్టారు. చంద్రబాబు తన పాలనలో జరిగిన అవినీతి పైన తాను విచారణకు సిద్ధం అంటారు. తీరా విచారిస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు పై ఉన్న కోర్టు స్టే లు ఎత్తేస్తే వాళ్ళ అవినీతి బాగోతం బయట పడుతుంది. ఈ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్ష పడుతుంది’ అని శ్రీకాంత్‌ రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు