ఏపీలో ఉచితంగా వ్యాక్సిన్‌

23 Apr, 2021 17:25 IST|Sakshi

18-45 ఏళ్ల లోపు వారికి ప్రభుత్వ ఖర్చుతోనే వ్యాక్సిన్‌

ఏప్రిల్‌ 24 నుంచి ఏపీలో నైట్‌  కర్ఫ్యూ

సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీరందరికి ఏపీ సర్కార్‌ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనుంది. 

ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘కరోనా కట్టడిపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన విస్తృతంగా చర్చించాము. ప్రజల భాగస్వామ్యంతో పాటు వాక్సినేషన్ ముఖ్యమని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నాం. 18-45 వయసు ఉన్న వారికి ఉచితంగా టీకా వేస్తాం. ఇందుకు గాను 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం. అలానే కరోనా కట్టడి కోసం రేపటి నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది’’ అని మంత్రి తెలిపారు.

‘‘సీటీ స్కాన్ పేరుమీద దోపిడీ చేయడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీనికి 2,500 రూపాయల ధర నిర్ణయించాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నాం. ఇది నిరంతరం జరుగుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దోపిడీకి పాల్పడవద్దని వినతి. మాస్క్, భౌతిక దూరం వంటి కోవిడ్‌ నియమాల అమలులో ప్రజలను భాగస్వామ్యం చేయమని సీఎం జగన్‌ సూచించారు. కళ్యాణ మండపాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని సీఎం ఆదేశించారు. బెడ్స్, కోవిడ్ రిక్రూట్మెంట్ కూడా పెంచుతున్నాం. జిల్లా స్థాయిలో 104 కాల్ సెంటర్లకు జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని కోరాము’’ అని మంత్రి తెలిపారు. 

చదవండి: అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు

మరిన్ని వార్తలు