రాయలసీమ ఎత్తిపోతల అలైన్మెంట్ను రూపొందించిన ప్రభుత్వం
ఇప్పటికే పలు ప్రాజెక్టుల వల్ల ముచ్చుమర్రి పరిసర గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులు
ఉన్న భూములు తీసుకుంటే రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని సర్కార్కు అధికారుల నివేదన
దాంతో ఒక్క ఎకరా భూసేకరణ చేయాల్సిన అవసరం లేకుండా అలైన్మెంట్ మార్పు
సంగమేశ్వరం నుంచి పోతిరెడ్డిపాడు వరకు భవనాశి నదిలో కాలువ తవ్వకం
పోతిరెడ్డిపాడు వద్ద జలవనరుల శాఖ అధీనంలోని భూమిలో పంప్ హౌస్ నిర్మాణం
దీని వల్ల భూసేకరణ వ్యయం రూ. 854 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: ఒక్క ఎకరా కూడా సేకరించాల్సిన అవసరం లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసేలా ప్రభుత్వం అలైన్మెంట్ను రూపొందించింది. శ్రీశైలం ప్రాజెక్టులో సంగమేశ్వరం (800 అడుగుల నీటి మట్టం) నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) వరకూ మూడు టీఎంసీలను తరలించే సామర్థ్యంతో భవనాశి నదిలో 17 కి.మీ.లు కాలువ తవ్వి.. అక్కడి నుంచి పీహెచ్ఆర్ దిగువన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా పంప్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. భవనాశి నదిలో కాలువ తవ్వడం వల్ల భూసేకరణ అవసరం ఉండదు. ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ) పనులు చేసే సమయంలో పీహెచ్ఆర్ వద్ద అదనంగా 123 ఎకరాల భూమిని సర్కార్ అప్పట్లోనే సేకరించింది. ఆ భూమిలో పంప్ హౌస్, 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించాలని నిర్ణయించింది. తద్వారా రాయలసీమ ఎత్తిపోతల పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించింది. దీనివల్ల భూసేకరణకు వ్యయమయ్యే రూ. 854 కోట్లు ఆదా అవుతాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పీహెచ్ఆర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులను రూ. 3,307.07 కోట్లకు ఎస్పీఎమ్మెల్(జేవీ) సంస్థకు సర్కార్ ఇప్పటికే అప్పగించిన విషయం విదితమే.
రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా..
శరవేగంగా పూర్తి చేస్తాం..: సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ.
శ్రీశైలం ప్రాజెక్టులో సంగమేశ్వరం నుంచి ముచ్చుమర్రి వరకూ బురద పేరుకుపోయి.. ఆ ప్రాంతమంతా ఊబిలా మారింది. అప్రోచ్ కెనాల్ను 800 అడుగుల మట్టంలో తవ్వడం వ్యయప్రయాసలతో కూడుకుంది. ముచ్చుమర్రి నుంచి పీహెచ్ఆర్ వరకూ 22 కి.మీ.ల కెనాల్ తవ్వాలంటే 1,200 ఎకరాల భూమిని సేకరించాలి. ఒక్క ఎకరా భూమిని సేకరించాల్సిన అవసరం లేకుండానే రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేసేలా అలైన్మెంట్ను రూపొందించాం. ఈ అలైన్మెంట్ ప్రకారం గడువులోగానే పనులు పూర్తి చేస్తాం.
భవనాశి నది మార్గంలోనే..: మురళీనాథ్రెడ్డి, సీఈ, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్.
నల్లమల అడువుల్లో జన్మించే భవనాశి నది పీహెచ్ఆర్కు దిగువన సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఆ నది ప్రవాహం వల్ల సంగమేశ్వరం నుంచి పీహెచ్ఆర్ వరకూ బురద పేరుకోలేదు. ఈ నదిలో పీహెచ్ఆర్ వరకూ 17 కి.మీ.ల పొడవున అప్రోచ్ కెనాల్ తవ్వడం ద్వారా 800 అడుగుల నుంచే నీటిని తరలించవచ్చు. పీహెచ్ఆర్ వద్ద అందుబాటులో ఉన్న 123 ఎకరాల్లో పంప్ హౌస్, సబ్ స్టేషన్ను నిర్మించి పనులు పూర్తి చేస్తాం.